Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గణేష్, రష్మిక మందన్నా జంటగా కన్నడలో విడుదలై ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని 'గీతా.. ఛలో' పేరుతో శ్రీ రాజేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై డి. దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఆడియో సీడీని అతిథిగా విచ్చేసిన సి.కళ్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మామిడాల శ్రీనివాస్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాడు. ఫైర్ బ్రాండ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇందులో నటించడం సినిమాకి కలిసొచ్చే అంశం. ఆమెకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. టైటిల్ చాలా క్యాచీగా, సినిమా రిచ్గా ఉంది. కన్నడలో కంటే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
'హీరో గణేష్ నటించిన 'ముంగారు మలే' సినిమా విడుదలప్పుడు నేను కర్నాటకలో ఉన్నా. ఎలా ఉందో చూద్దామని వెళ్ళితే టిక్కెట్లు దొరకలేదు. థియేటర్లో స్టూల్ వేసుకుని మరీ చూశా. బాగా నచ్చింది. ఇప్పుడంతా హీరోయిన్ గురించే చెబుతున్నారు గాని, గణేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే' అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. వీఎన్ ఆదిత్య చెబుతూ, 'హీరోయిన్తోపాటు హీరోకి మంచి సక్సెస్ రేటుంది. ఇది డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రెయిట్ చిత్రంలా ఉంది. సినిమాపై డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్లో మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమా కోసం నేను కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నా' అని అన్నారు. 'కన్నడలో ఇది రూ.30కోట్లు వసూలు చేసింది. 'గీతగోవిందం' తరహాలోనే ఇందులో కూడా మంచి ఎమోషన్స్, కామెడీ ఉన్నాయి. యూత్తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్కి బాగా నచ్చుతుంది. ఈ నెల 26న గ్రాండ్గా విడుదల చేస్తున్నాం' అని నిర్మాత మామిడాల శ్రీనివాస్ చెప్పారు. సమర్పకులు దివాకర్ చెబుతూ, 'ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నాం. రష్మిక ఇప్పుడు స్టార్ అయ్యారు. ఆమె రీమేక్ చేయదని డబ్ చేశాం. ఈ నెల 21న విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహిస్తున్నాం' అని తెలిపారు.