Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మల్టీస్టారర్ 'ఆర్ ఆర్ ఆర్' ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ సరసన నటించే బ్రిటీష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తారనేది సస్పెన్స్గా మారింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ని ఎంచుకోవాలని చిత్ర బృందం భావిస్తోందట. అయితే ఇది బ్రిటీష్కి చెందిన అమ్మాయి పాత్ర కావడంతో బ్రిటీష్కి చెందిన నటినే తీసుకోవాలని భావించినా, అన్వేషించే టైమ్ లేకపోవడంతో బాలీవుడ్ నటీమణులతో అడ్జెస్ట్ చేయాలని రాజమౌళి బృందం ప్లాన్ చేస్తుందట.
డైసీ స్థానంలో శ్రద్ధాని ఎంపిక చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే శ్రద్ధా తెలుగులో 'సాహో'లో నటిస్తున్న విషయం విదితమే. అయితే శ్రద్ధా ప్రస్తుతం మూడు, నాలుగు ప్రాజెక్ట్లతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె డేట్స్ కుదరకపోతే పరిణీతి చోప్రాని తీసుకోవాలను కుంటున్నారట. మరి ఈ ఇద్దరిలో ఎవరనేది కూడా ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. ఇదిలా ఉంటే, బాలీవుడ్ నటీమణులకు అనుగుణంగా స్క్రిప్ట్లో మార్పులు చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో కొమురం భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్ నటిస్తున్నారు. చరణ్ సరసన అలియా భట్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర పరిచయం అదిరిపోయేలా ఉంటుందట. సినిమాలో పరిచయ సన్నివేశం కోసమే రూ.20కోట్లు ఖర్చు చేస్తున్నారట. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజరు దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రద్ధా ప్రస్తుతం 'సాహో'తోపాటు 'చిచ్చోర్', 'స్ట్రీట్ డాన్సర్' చిత్రాల్లో నటిస్తోంది.