Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్ర సమర నేపథ్యాన్ని,
దేశ ప్రజల త్యాగాన్ని,
పోరాట స్ఫూర్తిని,
దేశభక్తిని చాటే రీతిలో
తెలుగు సినిమా పుట్టుక దగ్గర్నుంచి ఏదో ఒక రూపంలో
దర్శక,నిర్మాతలు సినిమాల్ని రూపొందిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో రూపొంది
విశేష ప్రేక్షకాదరణ పొందిన కొన్ని టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల గురించి తెలుసుకుందాం.. తెలుగు సినిమా స్వర్ణయుగ దశలో 'వందేమాతరం', 'నా దేశం', 'దేశ ద్రోహులు' వంటి చిత్రాలు పూర్తి స్థాయి స్వాతంత్య్ర సమర నేపథ్యం లో రూపొంది విశేష ఆదరణ పొందాయి. ఆ తర్వాత నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు తదితర హీరోలు సైతం స్వాతంత్య్రం బ్యాక్డ్రాప్లో రూపొందిన సినిమాల్లోనే కాకుండా వాళ్ళు నటించిన కొన్ని చిత్రాల్లో దేశభక్తిని ప్రభోదించేలా కనీసం పాటల రూపంలోనైనా ఉండేలా దర్శక,నిర్మాతలకు సహకరించడం విశేషం. 'బొబ్బలిపులి', 'సర్దార్ పాపారాయుడు' తదితర ఎన్టీఆర్ నటించిన చిత్రాలు ఈ కోవకి చెందినవే.
ఆ తర్వాత మన్నెం వీరుడు అల్లూరి సీతారామారాజు జీవిత కథ ఆధారంగా నటశేఖర కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామారాజు' సంచలన విజయం సాధించింది. తెల్లదొరల పెత్తందారీ విధానంపై ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా తిరగబడ్డ తెలుగు బిడ్డగా అల్లూరి సీతారామారాజు పోరాట చరిత్ర ఈ చిత్రం ద్వారా సినీ ప్రేక్షకుల్లో సైతం స్ఫూర్తిని రగిలించింది. దేశభక్తిని చాటిన గొప్ప చిత్రంగా జాతీయ అవార్డుని సైతం దక్కించుకుంది. స్వాతంత్య్ర సమర నేపథ్యాన్ని ఆధునిక శైలిలో చూపిస్తూ కమల్హాసన్ నటించిన 'భారతీయుడు' చిత్రం యావత్ భారతీయ సినీ ప్రేక్షకుల్ని అలరించింది. స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర ఆధారంగా వెంకటేష్ నటించిన 'సుభాష్ చంద్రబోస్', బాలకృష్ణ నటించిన 'పరమ వీర చక్ర', రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్రాజ్ కాంబినేషన్లో కృష్ణవంశీ రూపొందించిన 'ఖడ్గం', చిరంజీవి నటించిన 'ఠాగూర్', 'స్టాలిన్', శ్రీకాంత్ నటించిన 'మహాత్మ' తదితర చిత్రాలు సైతం దేశభక్తిని చాటాయి. ప్రస్తుత జనరేషన్లో ఈ తరహా చిత్రాలు గాని, కనీసం పాటలుగాని, సన్నివేశాలుగాని రాకపోవడం బాధాకరం. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో సైతం దేశభక్తిని చాటే చిత్రాలొచ్చాయి. స్వాతంత్య్ర తిరుగుబాటు నేపథ్యంలో రూపొందిన 'షాహీద్' చిత్రంలో దిలీప్కుమార్ నటించారు. రమేష్ సెహగల్ దర్శకత్వం వహించిన ఈచిత్రం అప్పట్లోనే సంచలనం సృష్టించింది.
స్వాతంత్య్రం సంపాదించిన తర్వాత కూడా ఓ భారతీయ స్త్రీ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో కళ్ళకు కట్టినట్టు రూపొందిన 'మదర్ ఇండియా' (1957) యావత్ ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. నర్గీస్ అత్యద్భుతంగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్లోనే కాదు యావత్ భారతీయ సినీ పరిశ్రమలో ఆల్టైమ్ క్లాసిక్గా నిలిచింది. అంతేకాదు ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రంగా కూడా పేరొందింది. దేశభక్తి నేపథ్యాన్ని ఏదో ఒక రూపంలో తన సినిమాలో ఉండేలా తపన పడిన హీరోలలో మనోజ్కుమార్ ముందుం టారు. ఆయన నటించిన 'పూరబ్ ఔర్ పశ్చిమ్' (1970) భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ నిర్మితమైంది. దేశభక్తిని చాటే ఈ చిత్రంతో మనోజ్కుమార్ పేరు ఆయన పోషించిన పాత్ర 'భరత్కుమార్'గా మారిపోవడం విశేషం.
1825-1875 మధ్య కాలంలో స్వాతంత్య్రం కోసం భారతీయులు పడిన వేదనకు ప్రతిరూపంగా 1981లో భారీ కాస్టింగ్తో 'క్రాంతి' చిత్రం విడుదలైంది. దేశంపై భారతీయుల కున్న మమకారాన్ని, గౌరవాన్ని, భక్తిని చాటేచిత్రంగా 1982లో 'రోజా' చిత్రం విడుదలైంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈచిత్రంతో ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహ్మాన్ సంగీత దర్శకుడిగా సినీ ప్రపంచానికి పరిచయమయ్యారు. దేశంలో జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టేందుకు నడుంబిగించిన యువకుడిగా 1994లో నానాపటేకర్ 'క్రాంతివీర్' చిత్రంలో నటించారు. 1971 ప్రాంతంలో ఇండో,పాక్ యుద్ధ నేపథ్యంలోని పరిస్థితులకు ప్రతీకగా దేశభక్తి స్ఫూర్తిని కలిగించే రీతిలో 'బోర్డర్' (1997) చిత్రం విడుదలైంది. స్వాతంత్య్ర సమరయోధుడు, ధైర్యశాలి భగత్సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా అజరుదేవగన్ నటించిన 'ద లెజెండ్ ఆఫ్ భగత్సింగ్' (2002) చిత్రం విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది.
ఇదే కోవలో 'లగాన్', 'మంగళ్పాండే', 'హే రామ్', 'ద ఫర్గాటెన్ హీరో', 'రంగ్ దే బసంతి', 'చక్ దే ఇండియా' తదితర చిత్రాలు సైతం రూపొంది విశేష ప్రేక్షకాదరణ పొందాయి.