Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మన సమాజం చాలా విషయాల్లో ముసుగు వేసుకుని ఉంది. ఆ ముసుగుని తీసేసే చిత్రమే 'రొమాంటిక్ క్రిమినల్స్'' అని అంటున్నారు దర్శకుడు పి.సునీల్ కుమార్రెడ్డి. 'రొమాంటిక్ క్రైమ్ కథ', 'ఓ క్రిమినల్ ప్రేమ కథ' చిత్రాలకు సీక్వెల్గా ఇప్పుడు 'రొమాంటిక్ క్రిమినల్స్' చిత్రాన్ని సునీల్కుమర్రెడ్డి రూపొందించారు. మనోజ్ నందం ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా నేడు (శుక్రవారం) విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు పి.సునీల్కుమార్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ, 'ఈ రొమాంటిక్ చిత్రాలను ప్రతి రెండేండ్లకు ఓసారి రూపొందించాలని ప్లాన్ చేశాను. కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది. ఇందులో ప్రస్తుత సమాజంలో యూత్కి సంబంధించి బయటికి రాని విషయాలను, వారి సమస్యలను తెరపై ఆవిష్కరిస్తున్నాను. ఓ జర్నలిస్ట్గా స్టడీ చేసి ఈ కథలను రాసుకుంటున్నా. 'రొమాంటిక్ క్రిమినల్స్'లో యువత వ్యసనాల గురించి చెప్పబోతున్నా. పోర్నోగ్రఫీ, డ్రగ్స్, ప్రేమ వంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఏదైనా శృతి మించితే వ్యసనంగా మారుతుంది. ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని స్టడీ చేసి, వారు చెప్పిన అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాను. సినిమా పోస్టర్లో ముగ్గురు అమ్మాయిలకు ముసుగులు వేశాం. వారు మూడు కాలాలను ప్రతిబింబిస్తారు. నిన్న, నేడు, రేపు సమాజం ఎలా ఉంటుందనేది చెబుతుంది. గతంలో చేసిన తప్పులకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు?, రేపు ఎలా ఉండబోతున్నారనేది ఈ ముసుగుల కాన్సెప్ట్. మూడు కోణాల్లో సందేశం ఇవ్వాలనుకున్నా. ఈ సినిమా ద్వారా ఎవరూ మారాలనుకోవడం లేదు. అలాగని చెడిపోతారంటే ఒప్పుకోను. ఎందుకంటే ప్రస్తుతం యువత అరచేతిలో ప్రపంచం ఉంది. చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా వారి చేతిలోనే ఉంది. సమాజంలో క్రిమినల్స్ ఎవరూ పుట్టరు. పరిస్థితుల రీత్యా తయారు అవుతారు. ఓ ఫ్రెష్ కంటెంట్ని, రియలిస్టిక్గా చెబుతున్నాను.
'సొంతూరు', 'గంగపుత్రులు' చిత్రాలను ఎలాంటి స్పిరిట్తో తీశానో అదే స్పిరిట్తో ఈ సినిమా తీశా. ఇప్పుడు సమాజంలో విలన్స్ పెరిగారు. అందుకే నెగటివ్ని చూపించాల్సి వస్తుంది. ఇదొక ఇండిపెండెంట్ చిత్రం. సినిమాలో ప్రతి ఫ్రేమ్ బాధ్యతగా ఉంటుంది. మా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. సినిమా ద్వారా నేను చెప్పింది ఆచరిస్తే అంతకంటే అదృష్టం మరేది లేదు. అయితే యువత చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే. వారిని సరిగా గైడ్ చేయకపోవడం వల్లే చెడుమార్గాల్లోకి వెళ్తున్నారు. ఆ రకంగా తల్లిదండ్రులకు ఇదొక చెప్ప పెట్టులాంటి చిత్రమవుతుంది. 18 ఏండ్లు నిండిన వారు ఓటు వేయడం ఎంత ముఖ్యమో, మా సినిమాని చూడటం కూడా అంతే ముఖ్యమని నేను భావిస్తున్నా. ఇది యూత్ని టార్గెట్గా చేసి తీసిన సినిమా. కాబట్టి వారే మెయిన్గా చూడాలి. ఇటీవల వస్తున్న వల్గర్ సినిమాలతో మా చిత్రాన్ని కలపడం దురదృష్టకరం. వాటికి భిన్నమైనది మా సినిమా అని థియేటర్లో చూశాక అర్థమవుతుంది. ఈ సిరీస్లో వచ్చిన గత సినిమాలను చూసి సుకుమార్, కృష్ణవంశీ వంటి తదితరులు ప్రశంసించారు. చాలా రియాలిటీగా సినిమా తీశారని చాలా రోజుల తర్వాత నన్ను మెచ్చుకున్నారు. గత చిత్రాలకంటే దీనికి మంచి క్రేజ్ వచ్చింది. 150కిపైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. దీంతోపాటు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా 'సీతా రామరాజు' సినిమాని రూపొందిస్తున్నా. ఇది జూన్ మొదటి వారంలో ప్రారంభమవు తుంది' అని చెప్పారు.