Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సోనీ చరిష్టా తాజాగా ఓ బంపర్ ఆఫర్ని అందుకుంది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఓ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఎంపికైంది. ఇందులో అర్జున్, జె.డి.చక్రవర్తి, రాధికా కుమార స్వామి, కె.విశ్వనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఫరీన్ ఫాతిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తెలుగు వర్షెన్కి తాజాగా 'ఇద్దరు' అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'అగ్ర కథానాయికలకు ఏమాత్రం తీసిపోని అందం, అభినయం సోనీ సొంతం. ఆమె ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండటం హ్యాపీగా ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, గోవా, థాయిలాండ్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది' అని తెలిపింది. 'యాక్షన్ ఎపిసోడ్స్తోపాటు థ్రిల్లింగ్ అంశాలతో సాగే హృద్యమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నాకు మంచి పేరుని తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నా. ఇదే కాకుండా హిందీ, కన్నడ భాషల్లోనూ పలు సినిమాలు చేస్తున్నా. తెలుగులో త్వరలోనే ఓ మంచి సినిమాకి సైన్ చేయనున్నాను. యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి.చక్రవర్తి, రాధిక కుమారస్వామి, గ్రేట్ డైరెక్టర్ కె.విశ్వనాథ్ వంటి హేమాహేమీలతో కలిసి నటించడం గర్వంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాతలకు రుణపడి ఉంటా' అని సోనీ చరిష్టా తెలిపింది.