Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించి వారి మనసుల్లోనే కాకుండా వెండితెరపై చెరగని ముద్ర వేసిన సీనియర్ నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహారావు (73) కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
విభిన్న పాత్రలతో ఓ వైపు వినోదాన్ని పండిస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తూనే, మరోవైపు సెంటిమెంట్, భిన్న భావోద్వేగాలతో కన్నీరు పెట్టించిన ఘనత ఆయనదే.. నాలుగు దశాబ్దాల కెరీర్లో 850కిపైగా సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి తన సుదీర్ఘ నట ప్రస్థానాన్ని కొనసాగించారు. దానికి మించి ఎనిమిది వేలకుపైగా నాటకాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు.
రాళ్లపల్లిది ఆంధ్రప్రదేశశ్లోని పశ్చిమగోదావరి జిల్లా రాచపల్లి. 1945ఆగస్ట్ 15న రాళ్లపల్లి వెంకట్రావు, కామేశ్వరమ్మలకు దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఇద్దరు అక్కలు, ముగ్గురు అన్నలున్నారు. రాళ్లపల్లి అందరిలో చిన్నవారు. 1958లో హైదరాబాద్ వచ్చి నాంపల్లిలోని ప్రభుత్వ కాలేజ్లో టెన్త్తోపాటు ఇంటర్ పూర్తి చేశారు. పదో తరగతి చదువుకునే రోజుల్లోనే రంగస్థలంపై ఆసక్తి ఏర్పడింది. ఆయన నటించిన తొలి నాటక 'కన్యాశుల్కం'. ఇందులోని కరటకశాస్త్రి శిష్యుడు మహేంద్ర ఆయన నటించిన తొలి పాత్ర. ఇలా వరుసగా దాదాపు ఎనిమిది వేలకు పైగా నాటకాల్లో నటించారు. 'మారని సంసారం' నాటిక రాశారు. దానికి కాలేజ్లో ఉత్తమ రచన, ఉత్తమ నటుడు అవార్డులు వచ్చాయి. బీఎస్సీ పూర్తవగానే రైల్వేలో కొన్నాళ్లు ప్యూన్గా పనిచేశారు. అప్పుడు కేంద్రప్రభుత్వ సాంస్క తిక శాఖ నిర్వహించిన నాటక పోటీలో ఉత్తమనటుడు, ఉత్తమ రచన అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా ఆయనకు జరిగిన సన్మానం తన జీవితంలో మర్చిపోలేనిదని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తర్వాత 'సాంగ్ అండ్ డ్రామా డివిజన్'లో జాబ్ వచ్చింది.
కుటుంబ నియంత్రణ, జాతీయ సమైక్యత వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ రాష్ట్రమంతా తిరిగి ప్రదర్శనలిచ్చారు. బుర్రకథలు కూడా వేశారు. తన భార్య స్వరాజ్యలక్ష్మి ప్రోద్భలంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. దర్శకుడు కె.ప్రత్యగాత్మకి లెటర్ రాయడంతో ఆడిషన్ చేసి 1973లో తొలిసారి 'స్త్రీ' సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆయన కెరీర్ని మలుపుతిప్పిన చిత్రం 1976లో వచ్చిన 'ఊరుమ్మడి బతుకులు'. ఇందులో తాగుబోతు హరిశ్చంద్రుడు పాత్ర పోషించి మెప్పించడంతోపాటు నంది అవార్డునందుకున్నారు. 'చిల్లరదేవుళ్లు'(1977)లోని వీరిగాడి పాత్రకు, 'చలిచీమలు'(1978)లోని పాత్రకు మంచి పేరొచ్చింది. వరుసగా 'సీతాకోక చిలుక', 'అభిలాష'లో గొప్ప పాత్రలు చేశారు. 'కంచు కాగడా'లో విప్లవకారుని పాత్ర. 'రేపటిపౌరులు'లో సింప్లిసిటీ మినిస్టర్ పాత్ర పోషించారు. 'అర్ధరాత్రి స్వతంత్రం', 'భూపోరాటం', 'అన్వేషణ', 'సగటు మనిషి' వంటి ప్రముఖ చిత్రాల్లో బలమైన పాత్రలు పోషించి తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మణిరత్నం 'బొంబాయి'లో హిజ్రాగా తన నట విశ్వరూపం చూపించారు. అయితే సినీ రంగం తొలినాళ్ళలో తెరపై ఆయన పేరుని 'ఆర్.వి.నరసింహారావు' అని వేసేవారు. 'తూర్పు వెళ్లే రైలు' సినిమా టైమ్లో బాపు ఇంత పెద్ద పేరు ఎందుకని 'రాళ్లపల్లి' పెట్టారు. అలా ఆయన రాళ్లపల్లిగా పాపులర్ అయ్యారు.
'ఖైదీ', 'రుస్తుమ్', 'శ్రీవారికి ప్రేమలేఖ', 'సితార', 'అన్వేషణ', 'రెండు రెళ్ళు ఆరు', 'ఆహానా పెళ్ళంటా', 'ప్రేమ సామ్రాట్', 'అగ్నిపుత్రుడు', 'సంకీర్తణ', 'శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్', 'కూలీ నెం.1', 'ఏప్రిల్ 1 విడుదల', 'సూర్య ఐపీఎస్', 'ద్రోహి', 'అంతం', 'బృందావనం', 'డిటెక్టివ్ నారద', 'జోకర్', 'అలీబాబా అరడజను దొంగలు', 'అల్లరి అల్లుడు', 'సూపర్ పోలీస్', 'ఘటోత్కచుడు', 'శుభ సంకల్పం', 'ధర్మ చక్రం', 'చంద్రలేఖ', 'చిత్రం', 'కలిసుందాం రా', 'హనుమాన్ జంక్షన్', 'జయం', 'సింహాద్రి', 'నిజం', 'అతడు', 'సంక్రాంతి', 'అంకుశం', 'సుందరకాండ', 'శుభప్రదం', 'భలే భలే మగాడివోరు' చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి రాళ్లపల్లిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు. ఆయన హాస్య పాత్రల్లో రాణించడానికి ప్రధాన కారణం దర్శకులు జంధ్యాల, వంశీలు. తమ సినిమాల్లో రాళ్లపల్లి కోసం ప్రత్యేకంగా హాస్య పాత్రలని రాసేవారట. తన నలభై ఏండ్ల కెరీర్లో మూడు నంది అవార్డులందుకున్నారు. రాళ్లపల్లి వంటని కమల్ హాసన్, కె.విశ్వనాథ్, బాలకృష్ణ, కోదండరామిరెడ్డి వంటి ప్రముఖులు ఇష్టపడేవారట. తెలుగుతోపాటు తమిళం, హిందీ చిత్రాల్లోనూ విలక్షణ పాత్రలతో మెప్పించిన రాళ్లపల్లి మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపాన్ని తెలిపింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలుండగా, ఒకరు చనిపోయారు. ఉన్న ఒక్క కుమార్తె ఆమెరికాలో ఉన్నారు.
మంచి స్నేహశీలిని కోల్పోయా : చిరంజీవి
''చెన్నైలోని వాణిమహల్లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్ళపల్లిగారిని కలిశాను. స్టేజ్ మీద ఆయన నటన చూసి ముగ్దుడినయ్యాను. ఆయన నటనను ఎంతో అభిమానించేవాడిని. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. దాంతో ఆయనతో నాకు మంచి అనుబంధం పెరిగింది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య 'మా' ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాం. 'ఎలా ఉన్నావు మిత్రమా..?' అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం ఆలింగనం చేసుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది. ఇంతలోనే ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను' అని చిరంజీవి అన్నారు.