Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'యువతకు మంచి సందేశాన్నిచ్చే కథాంశంతో రూపొందిన 'రొమాంటిక్ క్రిమినల్స్' సినిమాకి మంచి స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది' అని అంటున్నారు కథానాయికలు మౌనిక, అవంతిక. పి.సునీల్కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రొమాంటిక్ క్రిమినల్స్'. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హీరోయిన్ మౌనిక మాట్లాడుతూ, 'నాకిది తొలి చిత్రం. మొదటి సినిమాలోనే డ్రగ్స్కి అలవాటైన అమ్మాయి పాత్రలో నటించడం ఛాలెంజింగ్గా అనిపించింది. నటించాలా? వద్దా? అని అలోచించాను. దర్శకుడు కథని వివరించిన తీరు, నా పాత్ర ప్రాధాన్యత తెలుసుకుని నటించా. ఇందులో నీరజ అనే విద్యార్థిని పాత్ర పోషించాను' అని చెప్పారు. ' మత్తుకి బానిసైన ఏంజెల్ అనే అమ్మాయి పాత్రలో నటించాను. పేరెంట్స్ పిల్లల్ని సరిగా పెంచకపోతే, తమ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోకపోతే వాళ్ళు ఎలా తయారవుతారనేది నా పాత్ర ద్వారా దర్శకుడు చూపించారు. మత్తు మందులు మాని మంచిగా మారదామన్నా సమాజం మారనివ్వదు. చివరకు నా పాత్ర చనిపోతుంది. ఇదంతా ప్రస్తుత సమాజాన్ని అద్దం పడుతుంది. ఇది మంచి సందేశాత్మక చిత్రం. ఇందులో నటించేందుకు ఏమాత్రం సందేహించలేదు. ఇలాంటి పాత్రలు రావడం చాలా అరుదు' అని మరో నాయిక అవంతిక చెప్పారు.