Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా శుక్రవారం ప్రారంభమైంది. అల్లు అరవింద్ మనవరాలు బేబి అన్విత ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కెమెరా స్విచాన్ చేశారు. నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'అఖిల్ తెలుగులో హీరోగా 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్ను' సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ని సంపాదించుకున్నారు. అలాగే 'బొమ్మరిల్లు' చిత్రం ఇప్పటికి ట్రెండ్ సెట్టర్గా నిలిచిందంటే అది కేవలం దర్శకుడు భాస్కర్ విజన్ అండ్ వ్యాల్యూస్ వల్లే సాధ్యమైంది. ఆ తరువాత వచ్చిన 'పరుగు' చిత్రాన్ని ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా అద్బుతంగా తీర్చిదిద్దాడు. భాస్కర్కి ఫ్యామిలి ఆడియెన్స్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇప్పుడు వీరద్దిరి కాంబినేషన్లో సినిమా అనగానే ఈ క్రేజ్ మరింత పెరిగింది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అక్కినేని నాగచైతన్య చేసిన '100% లవ్' మంచి విజయాన్ని సాధించటం విశేషం. మళ్ళీ ఇప్పుడు మరో అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా నిర్మాతలు బన్ని వాసు, వాసు వర్మలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా '100% లవ్'కి మించిన విజయాన్ని సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మాతగా '100% లవ్' నుండి 'పిల్లా నువ్వులేని జీవితం', 'గీతా గోవిందం' వరకు వరస బ్లాక్బస్టర్ విజయాలు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ చిత్ర కథ నచ్చి దర్శకుడు వాసు వర్మ మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఓ నవ్యమైన కథాంశంతో సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం' అని తెలిపింది. ఈ కార్యక్రమంలో అమల, చిరంజీవి సతీమణి సురేఖ, అల్లు అరవింద్ సతీమణి నిర్మల, దర్శకుడు పరుశురామ్, శ్రీకాంత్ అడ్డాల, మారుతి తదితరులు హాజరయ్యారు.