Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరుణ్ తేజ్, లావణ్య జంటగా నవీన్ నాయని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఉండిపోరాదే'. గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై డా||లింగేశ్వర్ నిర్మించారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, 'ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడపిల్లని వద్దనుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. వారికి కనువిప్పు కలిగేలా, ఓ మంచి పాయింట్తో ఈ సినిమాని రూపొందించడం అభినందనీయం. టైటిల్ చాలా బాగుంది. కొత్తవాళ్ళతో తీసిన సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఇది కూడా మంచి విజయం సాధించి నిర్మాతకు డబ్బులు రావాలి. విడుదల విషయంలో మా ఫిల్మ్ ఛాంబర్ నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తాం' అని అన్నారు. చిత్ర దర్శకుడు నవీన్ నాయని చెబుతూ, 'యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. సినిమా చూస్తుంటే పక్కింటి అమ్మాయి జీవితాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా ఆద్యంతం భావోద్వేగభరితంగా, మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఔట్పుట్ విషయంలో నిర్మాత హ్యాపీగా ఉన్నారు' అని తెలిపారు. 'ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ కథ తెలుగు చిత్రపరిశ్రమలో ఓ రికార్డ్ సృష్టించేలా ఉంటుంది. ఓ అమ్మాయి కథని, అబ్బాయి ప్రేమని, బాధ్యతని చెప్పబోతున్నాం. ప్రేమకి యువత ఎలా ప్రభావితం అవుతుందనేది, మధ్యలో ఎంత మంది వచ్చినా జీవిత కాలం ప్రేమించేది తల్లిదండ్రులు మాత్రమే అనే విషయం చెప్పబోతున్నాం. విలువలు, బాంధవ్యాలు, వాణిజ్య అంశాల మేళవింపుగా రూపొందించాం. మా సినిమా ఆడియో విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. పాటలను చిత్ర వంటి టాప్ సింగర్స్తో పాడించాను. కానీ ఆడియోని కొనేందుకు ఆడియో సంస్థలు ముందుకు రావడం లేదు. చాలా తక్కువ ధరకు కొంటామంటున్నాయి. దీంతో సొంతంగా నేనే విడుదల చేస్తున్నా. ఆడియో కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది' అని నిర్మాత డా||లింగేశ్వర్ చెప్పారు. హీరో తరుణ్ తేజ్ చెబుతూ, 'ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది' అని చెప్పారు.