Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇందూ కీ జవానీ' అని టైటిల్ పెట్టి ఎవరైనా సినిమా తీస్తారా?
ఇలాంటి సినిమాల్లో ఎలా నటిస్తారు?, మన భావితరాలు తలదించుకునే రోజులు వస్తున్నాయి' అంటూ కైరాపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి మండిపడ్డారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఒక అగ్ర కథానాయికగా ఎదుగుతున్న యువ నటి కైరా అద్వానీ తాజాగా 'ఇందూ కీ జవానీ' చిత్రంలో నటించే ఛాన్స్ అందుకుంది. బెంగాలీ రచయిత అబిర్సేన్ గుప్తా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహిళా ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో కైరా సోషల్ మీడియాకు చెందిన డేటింగ్ యాప్స్లో కనిపించే అబ్బాయిల ప్రొఫైల్స్ చూసి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని డేటింగ్ చేసే పాత్రలో నటించనుంది. నేటి యువతుల పోకడలను చర్చిస్తూ పూర్తి కామెడీ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందట. ఆన్లైన్ డేటింగ్ గురించి చర్చించే ఈ సినిమా సెప్టెంబర్ నుంచి పట్టాలెక్కనుంది. ఇందులో నటించే అవకాశం రావడం పట్ల కైరా ఆనందం వ్యక్తం చేసింది. తాను ఘజియాబాద్కి చెందిన అమ్మాయిగా కనిపిస్తానని తెలిపి 'మొదటి మహిళా ప్రధాన చిత్రంలో నటిస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నాను' అని కైరా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 'ఓ వైపు మహిళా సాధికారత అంటూ మరో వైపు వారిని ఆట బొమ్మలుగా చూపిస్తున్నారు. ఈ సినిమాని సెన్సార్ బోర్డ్ అంగీకరిస్తే అది మహిళలకే అవమానకరం. మన భవిష్యత్ తరాలు తలదించుకునే రోజులొస్తున్నాయి. ఇలాంటి సినిమాలు తీయడానికి బాలీవుడ్కి సిగ్గులేదూ? ఇలాంటి వల్గారిటీ ఉన్న సినిమాలు తీసే దర్శక, నిర్మాతలు తమ కూతుళ్ళ కళ్ళలోకి చూడగలరా? ఇది పెద్ద సిగ్గుచేటు పని' అని కంగనా రనౌత్ సోదరి రంగోలి కైరా పెట్టిన ట్వీట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెతోపాటు పలువురు కైరాపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. కైరా ప్రస్తుతం బాలీవుడ్లో 'కబీర్ సింగ్', 'గుడ్ న్యూస్', 'లక్ష్మీబాంబ్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.