Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవీష్ హీరోగా రాఘవ ఓంకార్ శశిధర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఓ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది బుధవారం ప్రారంభమైంది. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అతిధిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్ నివ్వగా, సధానంద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఏషియన్ సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చిత్ర దర్శకుడు శశిధర్ మాట్లాడుతూ, '14 ఏండ్లుగా సినీ రంగంలో ఉన్నా. 'ఓంకార' అనే ఇండిపెండెంట్ చిత్రాన్ని, 'లడ్డు', 'నన్ను క్షమించు' వంటి లఘు చిత్రాల్ని రూపొందించాను. వాటికి పలు నంది అవార్డులతోపాటు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రులు ఎంత గొప్పవారో, ఓ దర్శకుడికి తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత, హీరో అంతే గొప్పవారు. నన్ను నమ్మిన నిర్మాత అభిషేక్కి, హీరో హవీష్కి థ్యాంక్స్. నన్ను దర్శకుడిగా ఎంపిక చేసిన సుకుమార్కి ధన్యవాదాలు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఓ కొత్త రకమైన రొమాంటిక్ లవ్ డ్రామా చిత్రమిది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. భావోద్వేగభరితంగానూ ఉంటుంది. జులై చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నాం. మా ప్రయత్నాని ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. హీరో హవీష్ మాట్లాడుతూ, 'నేను హీరోగా నటించిన 'సెవెన్' చిత్రం నెక్ట్స్ వీక్ విడుదలవుతుంది. అభిషేక్ నామా ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఆయన ప్యాషనేట్ ప్రొడ్యూసర్. శశిధర్ అత్యద్భుతమైన ప్రతిభ ఉన్న దర్శకుడు. భవిష్యత్లో పెద్ద దర్శకుడవుతాడు. ఫ్యామిలీ, రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. చాలా కొత్తగా ఉంటుంది. ఇక మా 'సెవెన్' సినిమా ఈ సమ్మర్ లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కాబోతుంది. చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. చిత్ర నిర్మాత అభిషేక్ నామా చెబుతూ, 'సుకుమార్, మేం నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో శశిధర్ మొదటి బహుమతిని పొందారు. దాని ఆధారంగా ఈ చిత్రానికి దర్శకత్వ అవకాశం కల్పించాం. ఇందులో నటించే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి.కళ్యాణ్, బెక్కం వేణుగోపాల్, సుధాకర్ రెడ్డి, మల్టీ డైమెన్షన్ వాసు, దర్శకుడు రమేష్ వర్మ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.