Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'ఎన్.జి.కె'. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ విడుదల చేస్తున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బిగ్ టికెట్ను హీరో సూర్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ,'రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు థ్యాంక్స్. వారి ఆదరణతో దీన్ని నా సొంత ఇంటిలా భావిస్తాను. నా గత చిత్రం విడుదలై ఏడాదిన్నర సమయం పట్టింది. మీలాగానే నేను కూడా శ్రీరాఘవకి పెద్ద ఫ్యాన్ని. అందుకే ఆయనతో ఈ సినిమా చేశాను. సినిమా చూసే ప్రేక్షకులకు ఇది యూనిక్ ఎక్స్పీరియెన్స్నిస్తుంది. ఈ సినిమా మా అందరికీ స్పెషల్. నా జీవితంలో శ్రీరాఘవ ప్రత్యేకమైన వ్యక్తి. 18 ఏండ్లు ఆయనతో పని చేయాలని వెయిట్ చేశాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత వ్యవహారాలను పక్కన పెట్టి వర్క్ చేశారు. శ్రీరాఘవ, యువన్ మ్యాజికల్ కాంబోలో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. రకుల్, సాయిపల్లవికి థ్యాంక్స్. మే 31న ప్రేక్షకుల అంచనాలను అందుకుంటామని భావిస్తున్నాను. ఓ సాధారణ వ్యక్తి రాజకీయ శక్తిగా మారి సమాజానికి ఎలా ఉపయోగపడ్డాడనేదే ఈ సినిమా' అని అన్నారు. 'నేను సూర్యకి పెద్ద అభిమానిని. అందరికీ సూర్య గొప్ప నటుడు అని తెలుసు. ఆయన అంత కంటే గొప్ప మనసున్న మనిషి. ఆయనకు సెల్యూట్. ఆయన ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలుసు. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ ఇద్దరూ మంచి నటీమణులు. నాకు సహకరించిన యువన్శంకర్ రాజా సహా ఎంటైర్ యూనిట్కు ధన్యవాదాలు' అని చిత్ర దర్శకుడు రాఘవ తెలిపారు. నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ, 'ఎన్.జి.కె' సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎస్.ఆర్.ప్రభు కృతజ్ఞతలు.
ఇంతకు ముందు పెద్ద హిట్స్ సాధించిన సూర్య సినిమాలకు ధీటుగా ఈ చిత్రం ఉంటుందని భావిస్తున్నాను. ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను' అని చెప్పారు. 'హైదరాబాద్కు వస్తే ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. నాకు చిన్నప్పట్నుంచి సూర్య అంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయడం కలలాగా ఉంది. సెట్లో చాలా సింపుల్గా, ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు షూటింగ్ సమయంలో ఎంతగానో సపోర్ట్ అందించారు. శ్రీరాఘవ ఓ విజనరీతో సినిమా చేస్తారు. ఆయన ప్రతి క్యారెక్టర్ను డిఫరెంట్గా చూపిస్తారు. ఈ సినిమా నుండి చాలా నేర్చుకున్నాను' అని సాయిపల్లవి చెప్పారు. రకుల్ ప్రీత్ సింగ్ చెబుతూ, 'శ్రీ రాఘవకి నేను పెద్ద ఫ్యాన్ని. కన్నడలో '7/జి బదావన కాలనీ' రీమేక్ చేశా. అప్పటి నుండి శ్రీ రాఘవతో పనిచేయాలని ఉంది. ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ ఇది. సీరియస్ రోల్ చేశాను. సినిమా కోసం ఎగ్జయిటెడ్గా వెయిట్ చేస్తున్నాను' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ తాళ్లూరి, మిర్యాల రవీందర్రెడ్డి, బాపినీడు, సినిమాటోగ్రాఫర్ శివకుమార్ విజయన్ తదితరులు పాల్గొన్నారు.