Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా 'మల్లేశం' చిత్రం రూపొందుతుంది. రాజ్. ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మల్లేశంలో పాత్రలో నటుడు ప్రియదర్శి నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రాజ్.ఆర్, శ్రీఅధికారి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన చింతకింది మల్లేశం మాట్లాడుతూ, 'ఒకరోజు రాజ్ ఫోన్ చేసి యూ ట్యూబ్లో మీరు మాట్లాడింది చూశాను. దాని గురించి సినిమా తీయాలనుకుంటున్నా అన్నారు. రెండున్నరేండ్లుగా కష్టపడి కథని సిద్ధం చేసి సినిమా తీశాడు. సామాన్య మానవుడి జీవితాన్ని సినిమాగా తీయడం చాలా గొప్ప విషయం. ప్రపంచానికి మల్లేశం గురించి చెప్పాలనే రాజ్ సంకల్పం నేరవేరింది. ప్రియదర్శి అద్భుతంగా నటించారు. సినిమాలో ఝాన్సీని చూస్తుంటే మా అమ్మని చూసిన ఫీలింగే కలిగింది. చక్రపాణి మా నాన్నపాత్రలో అద్భుతంగా నటించారు. సినిమా చూసే సందర్భంలో ఓసారి కళ్లలో నీళ్లు కూడా తిరిగాయి. నా కథను నేను తెరపై చూసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా' అని అన్నారు.
'ఈ సినిమాలో రెండు అద్భుతమైన పాటలు రాసే అవకాశం కలిగింది. ఆదర్శవంతమైన వ్యక్తి బయోపిక్ ఇది. ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుంది' గొరేటి వెంకన్న చెప్పారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, 'ఈ సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది. కానీ వదులుకున్నాను. మల్లేశం కథ విన్నప్పుడు తెలుగు ప్రేక్షకులకే కాదు, ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు చెప్పాల్సిన చిత్రమనిపించింది. ఇండిస్టీలో మనం చేసే వర్క్కి మీడియా అటెన్షన్ రాగానే దేవుళ్లం అయిపోతాం. నిజానికి మల్లేశంలాంటి వ్యక్తులు స్ఫూర్తిదాతలు. చాలా మంది స్ఫూర్తివంతమైన కథలు బయటికి రాక అలానే ఉండిపోతున్నారు. మన పక్కింట్లోనే, ఊర్లోనే జరిగే ఇలాంటి కథను తెరకెక్కించడం అనేది ఓ బాధ్యత. స్టీరియో టైప్ వంటి సినీ వర్గీకరణలు ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. ఎన్నో విభిన్నమైన కథలను చూడాలని ప్రేక్షకులుగా మేం కోరుకుంటున్నాం. ప్రియదర్శి ఒక్కొక్క పాత్రలో ఎంతో కష్టపడి జీవం పోసుకుంటున్నాడు. 'మల్లేశం' ఓ గొప్ప చిత్రమవుతుంది' అని చెప్పారు.
'బయోపిక్ అంటే ఓ బాధ్యత. దాన్ని ఎంతో సమర్ధవంతంగా నిర్వర్తించాం. ఇది ఆర్ట్ సినిమా కాదు. కమర్షియల్ సినిమా. ఇందులో విజరు దేవరకొండ, నానిలను హీరోలుగా అనుకున్నా. డేట్స్ సమస్య రావడంతో ప్రియదర్శిని తీసుకున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఆరో తరగతి డ్రాప్ అవుట్ అయి పద్మశ్రీ అవార్డు అందుకోవడం వరకు ఎదిగిన మల్లేశంని స్ఫూరిగా తీసుకోవాలి' అని చిత్ర దర్శకుడు రాజ్.ఆర్ తెలిపారు. వెంకట సిదారెడ్డి మాట్లాడుతూ, '80బ్యాక్డ్రాప్లో సినిమా తీయడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ చిత్ర బృందం ఎంతో కష్టపడింది. సినిమా ఘన విజయం సాధించాలి' అని చెప్పారు.
సందీప్ కిషన్ చెబుతూ, 'మల్లేశం వంటి గొప్ప వ్యక్తి బయోపిక్ని ప్రియదర్శి తన రెండు భుజాలపై మోశాడు. ఈ సినిమా చూసి దర్శకుడు రాజ్కి, ఆయన ఇంటెన్స్, నిజాయితీతో కూడిన ఆయన ఆలోచనలకు పెద్ద అభిమానినయ్యాను. ఈ సినిమాకి నా భాగస్వామ్యం ఏ రూపంలోనూ లేదనే బాధ ఉంది. అందుకే ఓ వంద టికెట్లు నేనే కొంటున్నా. మనం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నామని గర్వంగా చెప్పుకునే చిత్రమవుతుంది. కంటెంట్ బాగుంటే చూడ్డానికి మన జనాలంతా గొప్ప ప్రేక్షకులు మరెవ్వరూ లేరు' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పల్లె సృజన నిర్వాహకులు గణేశం, మధుర శ్రీధర్, ప్రియదర్శి, శ్రీఅధికారి, సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్స్ తదితరులు పాల్గొని చింతకింది మల్లేశం జీవితం స్ఫూర్తిదాయకమని, అటువంటి గొప్ప వ్యక్తి జీవితం వెండితెరపై ఆవిష్కరించడం గొప్ప విషయమని ప్రశంసించారు.