Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుల్లితెర విఠలాచార్యగా పేరొందిన ప్రముఖ దర్శకుడు డా||ముళ్ళపూడి సూర్యచంద్ర దర్శకత్వంలో తాజాగా 'బాలగోవిందం' అనే బాలల చిత్రం రూపొందనుంది. అరుణోదయ ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో తోలేటి వెంకట శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన్వి, మోక్షిత మాచిరాజు, అక్షర, లీలాకృష్ణ, వినీతశ్రీ, ధనుష్ సాయి, రోహన్ ఆయా వంటి బాలలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, 'వైకుంఠ వాసుడు విష్ణువు భూలోకంలో వెలియడానికి కారణం ఏంటి? కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రాక ముందు ఏ సంఘటనలు చోటు చేసుకున్నాయనే పూర్వ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పౌరాణిక సినిమాలు తీయాలంటే చాలా మంది భయపడతారు. కానీ నాకు ఆ భయం లేదు. చిన్నప్పుడే మా తల్లిదండ్రులు వాటిపై అవగాహన కల్పించారు. పైగా టీవీల్లో పలు సీరియల్స్ రూపొందించాను. అందుకే ఇప్పుడు పౌరాణిక చిత్రం రూపొందించడానికి ఉత్సాహంగా ఉన్నా. ఇందులో నటించే బాలలంతా 13ఏండ్ల లోపు వయసు కలవారే కావడం విశేషం. ఈ సినిమాని జూన్ నెలాఖరు నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించి, ఆదరిస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు. 'ఈ సంక్లిష్ట ప్రపంచంలో మన తెలుగు భాషలో, పౌరాణిక నేపథ్యంలో బాలలపై సినిమా తీయడం, విలువలు చెప్పాలనుకోవడం అభినందనీయం. పిల్లలతో సినిమా తీయడం చాలా కష్టమైన పని. సాధారణంగా చిన్న సినిమాలను, బాలల చిత్రాలను విడుదల చేయడం కష్టమవుతుంది. ఈ క్రమంలో నిర్మాత చేసిన ధైర్యానికి అభినందిస్తున్నా' అని అతిథిగా విచ్చేసిన ప్రభాకర్ జైన్ తెలిపారు. చిత్ర నిర్మాత చెబుతూ, 'ముళ్ళపూడిగారు మాకు సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత వెనిగళ్ళ రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాచిరాజు సాయి ప్రసాద్, కెమెరామెన్ మీర్, ప్రొడక్షన్ డిజైనర్ మహ్మద్ రఫితోపాటు బాల నటీనటులు పాల్గొన్నారు.