Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'డబ్బుల కోసం సినిమాలు చేయను. నెక్ట్స్ రోజు షూటింగ్ ఎలా ఉంటుంది?, ఎలాంటి పాత్రలు చేయాలనే ఉత్సాహంతో ఉంటాను' అని అంటున్నారు నటుడు జె.డి.చక్రవర్తి. చాలా గ్యాప్ తర్వాత జె.డి.చక్రవర్తి నటించిన చిత్రం 'హిప్పీ'. కార్తికేయ హీరోగా టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది.
ఈ సందర్భంగా జె.డి.చక్రవర్తి ఇటీవల మీడియాతో ముచ్చటించారు. 'ఈ మధ్య నన్ను ఆకట్టుకునే కథలు చాలా తక్కువగా వస్తున్నాయి. అందుకే గ్యాప్ వచ్చింది. 'హిప్పీ' కథ నచ్చి ఒప్పుకున్నా. ఇందులో నా పాత్ర ప్లేబారు తరహాలో ఓ కంపెనీకి సీఈవోగా కనిపిస్తా. నేటి యువతరం ఆలోచనలను ప్రతిబింబించే రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. ప్రేమకు, ఆకర్షణకు ఉన్న తేడాని తెలియజేస్తుంది. దర్శకుడు కృష్ణ సినిమాని మలచిన తీరు ఆకట్టుకుంటుంది. సెన్సార్ వాళ్లు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాలో ఉన్న ముద్దు సన్నివేశాలు చూసే ఆ సర్టిఫికెట్ ఇచ్చారని నేను అనుకోవడం లేదు. సినిమాలో చెప్పాలనుకున్న అంశాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా సూటిగా చెప్పారు. సెన్సార్ నిబంధనల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంది. అధికారులు చట్టంలో ఏముందో అదే చేస్తున్నారు. వాళ్ల తప్పేం లేదు. ముందు నిబంధనలు మార్చాలి. సెన్సార్ నిబంధనల్లో మార్పులు చేస్తే సమస్యలు రావు. అయితే ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాలుంటే సినిమాలు ఆడవు. కథలో దమ్ముండాలి. కొత్తగా ఉండాలి. అప్పుడే మంచి విజయం సాధిస్తాయి. 'అర్జున్రెడ్డి', 'ఆర్ ఎక్స్ 100' సినిమాలు అలాంటివే. సినిమాలో కార్తికేయ చాలా బాగా నటించాడు. మా గురువు రాంగోపాల్ వర్మ డబ్బులు సంపాదించడం తప్ప అన్నీ నేర్పారు. డబ్బుల కోసం నేను సినిమాలు చేయను. నటుడిగా ఎగ్జైట్ చేసే పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపుతాను. ప్రతి నటుడు కెరీర్ పరంగా చెప్పుకునేందుకు ఓ నాలుగైదు సినిమాలుండాలి. నా కెరీర్లో కూడా అలాంటి అయిదు మంచి చిత్రాలున్నాయి. అది నాకు సంతృప్తినిస్తుంది. హాలీవుడ్లో కొన్ని పాత్రల చుట్టూ కథ నడుస్తుంది. కానీ తెలుగులో హీరో చుట్టూ కథ తిరుగుతుంది. అందుకే ఇక్కడ గుర్తుండిపోయే పాత్రలు దొరకడం లేదు. ఇప్పుడిప్పుడు మన సినిమాల్లో మార్పు కనిపిస్తుంది. తమిళం, కన్నడ భాషల్లో నేను నటిస్తున్న చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. చాలా రోజుల తర్వాత మా గురువు వర్మ నిర్మాణంలో హీరోగా ఓ సినిమా చేయబోతున్నా. దానికి ఓ నూతన దర్శకుడు డైరెక్షన్ చేస్తాడు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని తెలిపారు.