Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్.నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ స్నేహ చిత్ర పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'మార్కెట్లో ప్రజాస్వామ్యం'. ఈ చిత్రాన్ని ఆదివారం పలువురు సినీ దర్శకులు, సినీ రచయితలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీనియర్ దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ, 'ఆర్.నారాయణమూర్తి ఎప్పుడూ ప్రజా సమస్యలపై సినిమాలతో పోరాడుతూనే ఉంటారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'నారాయణమూర్తి డబ్బు కోసం సినిమాలు చేయరు. సామాజిక అంశాలతో చేస్తారు. ఆయన పంథా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది' అని దర్శకుడు వి.వి.వినాయక్ చెప్పారు. పూరీ జగన్నాథ్ చెబుతూ, 'మంచి సందేశంతో తెరకెక్కించడం నారాయణమూర్తి ప్రత్యేకత. ఈ సినిమాని ఆదరించాలి' అని అన్నారు. 'సందేశాలతో సినిమాలు తీయడానికే నేను భయపడిపోతాను. అలాంటిది ఇన్నేండ్లుగా కమిట్మెంట్తో రాజీపడకుండా నారాయణమూర్తి సినిమాలు తీస్తున్నారు. సూటిగా, ధైర్యంగా తాను చెప్పాలనుకున్న విషయాల్ని ఈ సినిమాలో చూపించారు' అని శేఖర్ కమ్ముల తెలిపారు. పరుచూరి గోపాల్ కృష్ణ మాట్లాడుతూ, 'ప్రజాస్వామ్య వ్యవస్థని నోటు ఎన్ని విధాలుగా ప్రభావితం చేస్తుందో సందేశాత్మకంగా ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు' అని అన్నారు.
ఆర్.నారాయణమూర్తి చెబుతూ, 'వారసత్వ రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయి. పదిశాతం మంది పాలిస్తూ, 90శాతం పరిపాలించబడితే ప్రజాస్వామ్యం కాదు. బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం జ్యోతిరావుఫూలే, ఆంబేద్కర్ చూపించిన బాటలో పయనించాలని ఈ సినిమాలో చూపించాను. ప్రజాస్వామ్యాన్ని అంగట్లో సరుకు చేయకుండా దానిని కాపాడుకోవాలని చెప్పే చిత్రమిది. ప్రస్తుతం సెన్సార్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గద్దర్, ధవళసత్యం, ఎల్బీశ్రీరామ్, గటిక విజరు కుమార్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్ని మంచి సందేశంతో ఉన్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.