Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక హీరోహీరోయిన్లుగా కె.వి.ఆర్. మహేంద్ర దర్శకత్వంలో సురేష్బాబు సమర్పణలో మధుర శ్రీధర్రెడ్డి, యశ్ రంగినేని నిర్మిస్తున్న చిత్రం 'దొరసాని'. ఈ చిత్ర టీజర్ని గురువారం నిర్మాత సురేష్బాబు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, 'ఎంతో నిజాయితీగా కథను రెడీ చేసి సినిమాగా మలిచారు. ఒక అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీం మొత్తం చాలా అంకిత భావంతో పనిచేశారు. టీజర్ చూడగానే విజువల్స్ చాలా ఇంప్రెస్గా ఉన్నాయి. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా' అని అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, 'నాలుగేళ్ళ క్రితం మొదలైన 'దొరసాని'తో నా ప్రయాణం ఇంత వరకూ రావడానికి కారణం సురేష్ బాబు గారు, మధుర శ్రీధర్. ఈ సినిమాలో ఒక నిజాయితీ ఉంటుంది, స్వచ్చత ఉంటుంది, సహాజంగా ఉంటుంది, గొప్ప ప్రేమకథ ఉంటుంది. పదికాలాలు గుర్తుండిపోయే ప్రేమకథగా దొరసాని గుర్తుండిపోతుంది' అని చెప్పారు. నిర్మాత మధుర శ్రీధర్ చెబుతూ, 'రామానాయుడు గారి జయంతి రోజు దొరసాని టీజర్ రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. క్రమశిక్షణ, మంచితనానికి , దార్శనికతకు ఆయన మాకు మార్గదర్శకులు. దొరసాని కొత్త దర్శకులకు రిఫరెన్స్ గా మారుతుంది' అని చెప్పారు.