Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రామానాయుడు పేరు మీద ప్రతి ఏడాది ఉత్తమ నిర్మాత అవార్డుని అందించాలి. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు చేయాలి' అని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు విజేత, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత ప్రముఖ నిర్మాత రామానాయుడు జయంతి వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఆయన జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన రామానాయుడు విగ్రహాన్ని ఆయన తనయుడు సురేష్బాబు, నిర్మాత ఆదిశేషగిరిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ, 'రామానాయుడు సంస్థ నుంచి ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇండిస్టీకి పరిచయం అయ్యారు. అందులో నేను ఒకడిని. ఆయన నిర్మాణంలో తొలి సినిమా చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. కానీ వెంకటేష్ని హీరోగా పరిచయం చేసే అవకాశం నాకే ఇచ్చారు. మూవీ మొఘల్గా అనేక గొప్ప సినిమాలు నిర్మించిన రామానాయుడు ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన పేరుని వాళ్ళబ్బాయిలు నిలబెట్టాలని కోరుకుం టున్నా' అని అన్నారు. 'రామానాయుడుకి ఎవరూ సరిలేరు. ఆయనకెవరూ సరిరారు' అని మరో నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. సురేష్బాబు మాట్లాడుతూ, 'మాకిది భావోద్వేగభరితమైన రోజు. మానాన్న పట్ల అందరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞులం. మా కుటుంబం చిత్ర పరిశ్రమకే అంకితం' అని చెప్పారు. 'రామానాయుడుతో చెన్నై నుంచి మంచి అనుబంధం ఉంది. మేం ఎన్ని సినిమాలు చేసినా ఆయన్ని చేరుకోలేకపోయాం. మనిషిగా ఆయనంటే చాలా ఇష్టం. ఎంతో మందికి హెల్ప్ చేశారు. సినిమా రంగానికి సేవ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్కి, వారి కుటుంబానికి నా అభినందనలు'అని నిర్మాత రమేష్ ప్రసాద్ చెప్పారు. శేషగిరిరావు చెబుతూ, 'దాదాపు 50ఏండ్లు ఆయనతో మాకు అనుబంధం ఉంది. అద్భుతమైన సినిమాలు నిర్మించడమే కాదు, ఫిల్మ్ నగర్ దైవసన్నిధానం, ఎఫ్ఎన్సీసీ వంటి అన్నింటిలోనూ భాగమయ్యారు. అనేక మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లని, దర్శకులను పరిచయం చేసిన ఘనత ఆయనదే. ఆయన చేపట్టని పదవంటూ లేదు. పోటీ చేసిన మొదటిసారే ఎంపీగా గెలుపొందారు. నిర్మాత బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది' అని చెప్పారు. 'రామానాయుడు పేరు మీద ఉత్తమ నిర్మాత అవార్డుని స్థాపించి ప్రతి ఏడాది అందించాలి' అని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ చెప్పారు. నిర్మాత సి.కళ్యాణ్ చెబుతూ, 'సురేష్బాబు ఆధ్వర్యంలో ప్రతి ఏడాది లక్ష రూపాయాల బహమతితో ఉత్తమ నిర్మాత అవార్డుని అందజేస్తాం' అని చెప్పారు. 'రామానాయుడు సంస్థలో 48 సినిమాలకి రాశాం. ఆయన మా గుండెల్లో ఉంటారు' అని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. ఆర్.నారాయణమూర్తి చెబుతూ, 'నా సినిమాల విడుదల విషయంలో ఆయన ఎంతో సపోర్ట్ అందించారు. 'మనం ఏ రంగంలో ఉన్నా నెంబర్ వన్గా ఉండాల'ని ఆయన చెప్పేవారు. అదే విధంగా కృషి చేసి నెంబర్ వన్ అయ్యారు. ఆయన పుట్టిన రోజునే తెలుగు చిత్ర పరిశ్రమ పుట్టిన రోజుగా భావిస్తా' అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి.గోపాల్, రాఘురామకృష్ణంరాజు, కాజాసూర్యనారాయణ, శివకృష్ణ, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, అనిల్ సుంకర, కె.ఎల్.నారాయణ, రాందాసు, ఆర్కే గౌడ్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.