Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఫలక్నుమా దాస్'. ప్రశాంతి కథానాయికగా నటించింది. వన్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రమర పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవల విడుదలైన సినిమాకి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం సక్సెస్మీట్ ఏర్పాటు చేశారు.
నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ, 'రెండేండ్లు కష్టపడి విశ్వ ఈ కథని రెడీ చేశాడు. హైదరాబాద్లోని 118 కొత్త లొకేషన్లలో చిత్రీకరించాం. విడుదలైన సినిమాకి అన్ని ఏరియాల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. పాజిటివ్ టాక్తో రన్ అవుతోంది. మా కష్టానికి ప్రతిఫలం లభించింది. 7 రోజుల్లో రూ.7కోట్ల 50 లక్షలు వసూలు చేసిందని చెప్పడానికి సంతోష పడుతున్నా. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ఆడియెన్స్కి థ్యాంక్స్. ఈ చిత్రంలో సెకండ్ ఆఫ్ ల్యాగ్ ఎక్కువైందని అంటున్నారు. కొంత ల్యాగ్ను తీసేసి సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాం. నేటి నుంచి కొత్త ఎడిట్ వెర్షన్ ప్రదర్శితమవుతుంది. 50 థియేటర్స్తో పాటు మల్టీప్లెక్స్లు కూడా పెరుగుతున్నాయి. మా నెక్స్ట్ చిత్రం 'ఫలక్నుమా దాస్ 2' భారీ క్యాస్టింగ్తో ఉంటుంది' అని అన్నారు. 'సినిమా ఫలితం విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. విడుదలైన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఇకపై కూడా అవుతూనే ఉంటుంది. ఈ సినిమాతో ధమ్కీ ఇచ్చా. నెక్ట్స్ సినిమాతో షాకిస్తా. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నా' అని విశ్వక్ సేన్ తెలిపారు. నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ, ''శివ' సినిమాలో యాదగిరి, 'చందమామ' సినిమాలోని పాత్ర తర్వాత అంతటి పేరును తెచ్చిన చిత్రమిది. మలయాళంలో వచ్చిన 'అంగమాలై డైరీస్' సినిమాని స్ఫూర్తిగా తీసుకుని విశ్వక్ సేన్ ఈ సినిమాని రూపొందించారు. అతను పడిన కష్టం ఫలించి ఇంత పెద్ద రిజల్ట్నిచ్చింది. టీమ్ అందరికీ అభినందనలు' అని చెప్పారు. 'సినిమా చూసిన మొదటి రోజే పూర్తి సంతృప్తితో ఉన్నాను. అనుకున్న ఫలితం వచ్చినందుకు సంతోషంగా ఉన్నాను' అని కో ప్రొడ్యూసర్ మాణిక్యరావు అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రశాంతితోపాటు జీవన్, యస్వంత్, సంజరు, టోనీ, కౌశిక్, కార్తిక్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.