Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభని వెలుగులోకి తీసుకొచ్చిన నిర్మాత టి.వి.ఎస్.శాస్త్రి. తెలుగు సినిమాల నిర్మాణానికి ఓ క్రమబద్ధమైన రూపునిచ్చి ప్రతిభాశాస్త్రిగా పాపులరైన టి.వి.ఎస్. శాస్త్రికిది శతజయంతి సంవత్సరం కావడం ఓ విశేషమైతే, శనివారం ఆయన జయంతి కావడం మరో విశేషం. జూన్ 8, 1920న కృష్ణా జిల్లా గొడవర్రులో జన్మించిన ఆయన 1940లో స్నేహితులతో కలిసి కె.యస్.ప్రకాశరావు, జి.వరలక్ష్మి హీరోహీరోయిన్లుగా సినిమా నిర్మించాలని ముంబయి వెళ్ళారు. ఒక పాట రికార్డింగ్తో ఆ సినిమా ఆగిపోవడంతో, నటుడు మజర్ఖాన్ సినిమా కంపెనీలో జనరల్ మేనేజర్గా చేరారు. కె.యస్.ప్రకాశరావు కోరిక మేరకు 'ద్రోహి' చిత్రనిర్మాణ పనులు చూసుకోవడానికి మద్రాసు వచ్చి, ఆ తర్వాత ఘంటసాల బలరామయ్య ప్రతిభా సంస్థలో చేరారు. అలా 'ప్రతిభా'శాస్త్రిగా పాపులర్ అయ్యారు. అక్కడే ఆయనకు నటుడు అక్కినేని నాగేశ్వరరావు మిత్రులయ్యారు. 1959లో శాస్త్రి, వాసిరెడ్డి నారాయణరావుతో కలసి 'జయభేరి' చిత్రం నిర్మించారు. ఆ తర్వాత వీనస్ వారి 'సుమంగళి', 'పవిత్రబంధం', 'లక్ష్మీనివాసం', 'మంచివాడు', 'అండమాన్ అమ్మాయి', సారథీ వారి 'ఆత్మీయులు', విజయా వారి 'శ్రీరాజరాజేశ్వరి కాఫీ క్లబ్', దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన హిందీ చిత్రాలకు అసోసియేట్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. 2007 ఆగష్టులో ఆయన అస్వస్థతకు గురైన సమయంలో ఏఎన్నార్ చెన్నై వచ్చి 'అక్కినేని పురస్కారాన్ని' అందజేశారు. ఆ ఏడాది డిసెంబరు 20న ప్రతిభా శాస్త్రి కన్నుమూశారు. చిత్ర పరిశ్రమలో ఆయన ప్రతిభని కొనియాడుతూ 'గ్రాండ్ ఓల్డ్మ్యాన్ ఆఫ్ తెలుగు సినిమా' అని కొంగర జగ్గయ్య కితాబిస్తే, 'అద్వితీయ ప్రతిభాశాస్త్రి' అని పి.బి. శ్రీనివాస్ అభివర్ణించారు.