Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేతన్ మద్దినేని, కశిష్ వోరా జంటగా నరేష్ కుమార్ హెచ్ఎన్ దర్శకత్వంలో డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మంజునాథ్ వి కందుకూర్ నిర్మించిన చిత్రం 'ఫస్ట్ ర్యాంక్ రాజు'. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు
నరేష్ కుమార్ మాట్లాడుతూ, 'చదువుల్లో ఫస్ట్ ఉన్న రాజు బుద్ధిలో వెనకబడిపోతాడు. అలాంటి వ్యక్తికి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కొన్నాడు?,
వాటి నుంచి ఎలా బయటపడ్డాడు?, ఈ క్రమంలో చోటు చేసుకునే వినోదభరిత సన్నివేశాల సమాహారమే ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్కి విశేష స్పందన లభించింది. త్వరలోనే ట్రైలర్ని విడుదల చేస్తాం. సినిమాలో ప్రకాష్రాజ్, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావు రమేష్, తనికెళ్ళ భరణి, నాగినీడు, ప్రియదర్శి వంటి పెద్ద ఆర్టిస్టులు నటించారు. వారి కోసం వెయిట్ చేసి మరీ షూట్ చేశాం. హైదరాబాద్, రాజమండ్రి వంటి అందమైన లొకేషన్లలో చిత్రీకరించాం. సిక్కీంలో చేసిన పాట ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలో మరో పాటని విడుదల చేస్తాం. నిర్మాణ విలువలు ఏమాత్రం తగ్గకుండా క్వాలిటీగా రూపొందించాం. మా సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు. 'ఇప్పుడున్న పరిస్థితుల్లో మా సినిమా టీజర్ వైరల్ కావడం గొప్ప విషయం. త్వరలో ట్రైలర్తో రాజు పాత్రకి సంబంధించిన బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. సినిమాకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న మారుతికి థ్యాంక్స్. అలాగే సినిమాని విడుదల చేస్తున్న గీతా ఆర్ట్స్ అల్లు అర్జున్, బన్నీవాసు, అల్లు అరవింద్కి ధన్యవాదాలు' అని హీరో చేతన్ చెప్పారు. నిర్మాత మంజునాథ్ చెబుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెల 21న విడుదల చేస్తున్నాం. సినిమాని రిలీజ్ చేస్తున్న గీతా ఫిల్మ్స్కి థ్యాంక్స్' అని అన్నారు. 'కన్నడలో భారీ విజయం సాధించిన చిత్రమిది. స్టూడెంట్స్తోపాటు పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా' అని రామ్కుమార్ చెప్పారు. హీరోయిన్ కశిష్ వోరా చెబుతూ, 'ఆడియెన్స్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాం. ఇందులో మంచి పాత్ర పోషించే అవకాశం లభించింది' అని చెప్పారు.