Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సప్తగిరి, వైభవి జోషి జంటగా అరుణ్ పవార్ దర్శకత్వంలో శివ శివమ్ ఫిల్మ్స్ పతాకంపై నరేంద్ర, జీవీఎన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'వజ్రకవచధర గోవింద'. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య విడుదల చేస్తున్నారు. ఈ నెల 14న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హీరో సప్తగిరి మాట్లాడుతూ, 'దేవుడికి, నాకు మధ్య జరిగే కథే ఇది. మాది తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్', 'సప్తగిరి ఎల్ఎల్బి' తర్వాత నేను హీరోగా నటించిన మూడో చిత్రం. 'సప్తగిరి ఎక్స్ప్రెస్' మంచి విజయం సాధించి డబ్బులు తెచ్చింది. 'సప్తగిరి ఎల్ఎల్బి' పేరు తెచ్చింది. ఈ సినిమా ఆ రెండింటిని తెస్తుందని ఆశిస్తున్నా. మనస్ఫూర్తిగా ఆదరించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు. 'జబర్థస్త్కు చెందిన పది, ఇరవై మంది కలిసి కామెడీ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. నాకు ఈ ఫ్లాట్ఫామ్ ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. ఖర్చుకి వెనకాడకుండా సినిమాని నిర్మించారు. మనం చేసే పనే కాదు, వెళ్ళే దారి కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పే చిత్రమిది. అన్ని వర్గాల ఆడియెన్కి నచ్చే సినిమా అవుతుంది' అని దర్శకుడు అరుణ్ పవార్ చెప్పారు.
నిర్మాత జీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ, 'వజ్రాన్ని అమ్మి ఊరు ప్రజలను హీరో ఎలా కాపాడుకున్నాడనేది సినిమా. ఈ క్రమంలో జరిగే సన్నివేశాలు వినోదాన్ని, భావోద్వేగాలని పంచుతాయి. నాకు చిత్ర పరిశ్రమ గురించి తెలియదు. దర్శకుడు అరుణ్ ఇచ్చిన నమ్మకంతో, సప్తగిరి ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమా తీశా. సప్తగిరి లేకపోతే మేం లేం. నాకు అమ్మనాన్న, దేవుడు తర్వాత గురువుగా మరో నిర్మాత నరేంద్ర నిలిచారు. సినిమా నచ్చి విడుదల చేస్తున్న బ్రహ్మయ్యకు ధన్యవాదాలు. టీమ్ అంతా ప్రాణం పెట్టి, ఇష్టంతో కష్టపడి చేశాం. సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు. 'టీజర్ చూసి ఎలాగైనా సినిమా హక్కులు తీసుకోవాలని చిత్ర బృందాన్ని కలిశాను. కొంత మెటీరియల్ చూసి సింగిల్ పేమెంట్కి కొన్నాను. కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేసే చిత్రమవుతుంది' అని సినిమాని రిలీజ్ చేస్తున్న బ్రహ్మయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ ప్రవీణ్ వనమాలి, ప్రకాష్, మహేంద్ర, అప్పారావు తదితరులు పాల్గొని చిత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలను తెలియజేశారు.