Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లైట్ మ్యూజిక్ చాలా మందికి, చాలా పాటలకు ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, అదొక మెడిసిన్ కూడా. ఇలాంటి లైట్ మ్యూజిక్ను సీతారామరాజు, ఆశీర్వాదం కలిసి శ్రోతలకు అందించడానికి చేసే ఈ ప్రయత్నం ఎంతో గొప్పది. సినీ సంగీతం వివి విని అలసిన శ్రోతలకు 'నీలాకాశం' అనే సరికొత్త తెలుగు ఆల్బమ్ స్వాంతన కలిగించనుంది' అని ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ అన్నారు. సీతారామరాజు అనే నూతన సంగీత దర్శకుడు 'నీలాకాశం' అనే ఆల్బమ్ని రూపొందించారు. కృష్ణ తేజస్వి, ఆశిక్ అలీ, అఖిలేశ్వర్ చెన్ను, నికిత శ్రీవల్లి, మనీషా పండ్రంకి వంటి కొత్త గాయకులు ఇందులో పాటలు ఆలపించారు. ఇది ఆల్బమ్ వాటర్ లెమన్ రికార్డ్స్ అనే కొత్త ఆడియో సంస్థ ద్వారా మార్కెట్లోకి రానుంది. ఈ ఆల్బమ్ విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆల్బమ్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్ థమన్ మాట్లాడుతూ, 'ఆశీర్వాద్ మాకు చాలా క్లోజ్. ఈ ఆల్బమ్ సక్సెస్ఫుల్గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింగర్స్ అందరికి అభినందనలు' అని అన్నారు. 'ఘంటసాలగారు ఇలాంటి లైట్ మ్యూజిక్ చేసేవారు. ఆ తరాన్ని అనుసరిస్తూ ఇప్పుడు 'నీలాకాశం' అనే లైట్ మ్యూజిక్ ఆల్బమ్ను తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. ఏ జనరేషన్ అయినా, ఎప్పుడు విన్నా ఈ లైట్ మ్యూజిక్ ఆహ్లాదాన్నిస్తుంది. వీరి స్ఫూర్తితో మరెన్నో లైట్ మ్యూజిక్స్ రావాలని కోరుకుంటున్నాను'అని తమ్మారెడ్డి తెలిపారు. 'ఈ మ్యూజిక్ ఆల్బమ్లో అటు అందమైన మెలోడీలతోపాటు ఆధునికమైన అమరికతో కూడిన సంగీతం వినొచ్చు' అని ఆశీర్వాదం తెలిపారు.