Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హాస్యనటులు హీరోగా మారి సక్సెస్ కాలేక మళ్ళీ హాస్య పాత్రలే చేస్తున్నారనే కామెంట్ వినిపిస్తుంది. కానీ దాన్ని నేను నమ్మను. వారిలా నా కెరీర్ ఉంటుందనుకోను. ఇక్కడ ఎవరి స్టయిల్ వారిది, ఎవరి కెరీర్ వారిది' అని అంటున్నారు సప్తగిరి. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'తో హీరోగా మారిన సప్తగిరి ఆ తర్వాత హాస్యభరిత పాత్రలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా 'వజ్రకవచధర గోవింద' అనే చిత్రంలో హీరోగా నటించారు. అరుణ్ పవార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా సప్తగిరి మంగళవారం మీడియాతో ముచ్చటించారు.
సందేశాత్మకంగా..
నేను హీరోగా నటిస్తున్న మూడో చిత్రమిది. వజ్రం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇందులో నా పేరు గోవిందం. వరుసగా దొంగతనాలు చేస్తుంటాను. వజ్రం దొరకడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అది ఎలాంటి లాభాలు తెచ్చిపెట్టింది, నా జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పిందనేది సినిమా. ఇందులో చాలా ఎమోషనల్గా ఉంటుంది. సినిమాలో నేను మూడు గెటప్లో కనిపిస్తాను. నా మొదటి సినిమా 'సప్తగిరి ఎక్స్ప్రెస్'కి దర్శకత్వం వహించిన అరుణ్తో మరో సినిమా చేస్తానని మాటిచ్చా. ఈ సినిమా కథకి అతను న్యాయం చేస్తాడని దర్శకత్వ బాధ్యతలు అప్పగించా. తను అంతే బాగా తెరకెక్కించారు. గోవిందనామం అజయం.. విజయం అంటుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి 'వజ్రకవచధర గోవింద' అనే టైటిల్ పెట్టాం. క్యాన్సర్తో బాధపడుతున్న ఊరి జనం కోసం హీరో ఏం చేశారనేది ఆసక్తికరం. మంచి వినోదంతోపాటు సందేశం ఉన్న చిత్రమిది.
పేరు, డబ్బులు రావాలని..
నా మొదటి సినిమా 'సప్తగిరి ఎక్స్ప్రెస్' మంచి పేరు, డబ్బులు తెచ్చింది. 'సప్తగిరి ఎల్ఎల్బి' పేరును మాత్రమే తెచ్చింది. ఈ సినిమా ఆ రెండింటిని తెస్తుందని ఆశిస్తున్న. గత రెండు సినిమాల్లో కథపై ఎక్కువ దృష్టిపెట్టాను. బేసిక్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ని కావడంతో కథ బలంగా ఉండాలని చూశా. ఈ కారణంతో వినోదంపాళ్ళు తగ్గాయి. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ని పెంచాను. సినిమాలో హీరోని నేనే అయినా కమెడియన్గానే కనిపిస్తా. దీనికితోడు జబర్దస్త్ టీమ్ చేసే కామెడీ మరింత హైలైట్ అవుతుంది. మరోవైపు హాస్యనటులు డాన్సులు, ఫైట్స్ ఎక్కువగా చేస్తూ వాణిజ్య అంశాలపై దృష్టి పెడుతున్నారని అంటున్నారు. అందుకే ఈ సినిమాలో డాన్సులు, ఫైట్లు పక్కన పెట్టి వినోదానికి ప్రాధాన్యతనిచ్చాను.
డైరెక్టర్ అవ్వాలని వచ్చా..
'సిందూరం', 'భారతీయుడు' సినిమాలు చూసి దర్శకత్వంపై ఆసక్తి ఏర్పడింది. డైరెక్టర్ కావాలనే చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు కొందరు దర్శకులు నాలో కమెడియన్ని చూశారు. నాకు మాత్రం కమెడియన్ అవ్వాలని లేదు. కానీ వాళ్ళు నన్ను కమెడియన్ని చేశారు. నిజం చెప్పాలంటే నా కామెడీకి నేనే నవ్వను. ఒక్క 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమా చూసి బాగా నవ్వుకున్నా. అయితే హీరోగా మారిన హాస్యనటులు సక్సెస్ కాలేక, తిరిగి హాస్యనటులుగా మారుతున్నారని అంటున్నారు. దాన్ని నేను నమ్మను. అందరి లైఫ్ ఒకలా ఉండదు. ఎవరి పరిస్థితి వారిది. ఆ రోజులకు, ఈ రోజులకు తేడా ఉంది. నేనీ స్థాయిలో ఉన్నందుకు హ్యాపీగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రెడీ..
హీరో అయ్యాక కామెడీ పాత్రలు రావడం తగ్గాయి. కమెడియన్ ఇమేజ్ హీరో కెరీర్కి అడ్డంకి అవుతున్న మాట వాస్తవం. హీరోగా చేసినా హాస్య పాత్రల్లో నటించేందుకు సిద్ధమే. అవకాశాల కోసం కొంత మంది దర్శకులను కలిసి పాత్రలు అడిగాను కూడా. ప్రస్తుతం సందీప్ కిషన్ సినిమాలో హాస్య పాత్ర పోషిస్తున్నా. మరో రెండు మూడు చర్చల్లో ఉన్నాయి. దీంతోపాటు హీరోగా 'దెయ్యంపట్టింది 1', 'దెయ్యం పట్టింది 2' చిత్రాలు చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. అవి స్క్రిప్ట్ దశలో ఉంది. నేను ఏ సినిమా చేసినా కథని నమ్ముకునే చేస్తా. గత చిత్రాలు అలానే చేశా. ఇకపై కూడా అలానే చేస్తాను.