Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'విజయం దక్కే వరకు పోరాడాలనే సందేశాన్నిచ్చిన 'మల్లేశం' చిత్రం నా మనసుకి బాగా నచ్చింది. ఇదొక స్ఫూర్తివంతమైన సినిమా' అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'మల్లేశం'. అనన్య కథానాయికగా, చక్రపాణి ప్రధాన పాత్రలో నటించారు. శ్రీ అధికారి, రాజ్.ఆర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఇటీవల కేటీఆర్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమాని వీక్షించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి చాలా మంది సూర్యుల్లాగా పనిచేశారు. వారికి నా అభినందనలు. సినిమా చాలా హృద్యంగా, మానవీయంగా, సహజంగా, అద్భుతంగా ఉంది. సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులెన్నో, సమాజంలో అజ్ఞాత సూర్యలెందరో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కవితలెన్నో' అనే ఓ కవిత సినిమాలోని రెండు గంటల ఎమోషన్ని, ప్రయాసని, కృషిని, సామాన్యుడి ప్రతిభని ఆవిష్కరించే క్రమంలో ఎన్ని కష్టనష్టాలుంటాయో తెలియజేసింది. భారతదేశంలోని అందరూ చేనేత కళాకారుల ఆత్మహత్యలను, స్థితిగతులను చూపిస్తూ, ఈ వృత్తిలో రాణించాలంటే ఉండే కష్టనష్టాలను చూపుతూ, అందులో భాగంగా ఓ రూరల్ ఇన్వెంటర్ జీవితాన్ని చూపించారు. ఇందులోమదర్ ఈజ్ నెస్సిసిటీ ఆఫ్ ఇన్వెన్షెన్ అని చూపించారు. మల్లేశంగారు తన తల్లి కష్టాన్ని చూసి శోధించి కనుగొన్నారు. ఆ రకంగా తన తల్లికే కాదు. ఎంతో మంది తల్లుల సమస్యను ఆయన తొలగించిన విషయాన్ని అద్భుతంగా చూపించారు. ఇలాంటి అజ్ఞాత సూర్యులందరికీ, ఇన్నోవేటర్స్కి, మనం వెళ్లే దారిలో ఎన్నో సమస్యలుంటాయి. అన్ని దారులు మూసుకుపోయినా, ఏదో ఒకదారి తెరుచుకుని ఉంటుందనే విషయాన్ని చక్కగా వివరించింది. లీడ్ క్యారెక్టర్లో ప్రియదర్శి అద్భుతంగా నటించారు. రైటర్ పెద్దంటి అశోక్కుమార్ తెలంగాణ భాష, యాసలోని మాధుర్యాన్ని చక్కగా రాశారు. ఈ సినిమాకు ప్రభుత్వం నుండి సహకారం ఎంతో అవసరం. సినిమాటోగ్రాఫర్ మంత్రితో, ముఖ్యమంత్రితో మాట్లాడతాను. పన్ను మినహాయింపు లాంటివన్నీ చేసేందుకు ప్రయత్నిస్తా' అని అన్నారు. 'రాజ్ ప్యాషన్ చూసి నేను భయపడ్డాను. సినిమాని కొనడానికి ఎవరూ రారేమో అనుకున్నా. కానీ మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలి. థియేటర్కు బయటకు వచ్చేటప్పుడు ఓ ఫీల్తో వస్తారు' అని నిర్మాత సురేష్బాబు చెప్పారు.