Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కల్కి'. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఆదాశర్మ, నందితా శ్వేత కథానాయికలుగా నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా రిలీజ్ రైట్స్ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ, 'ఈ సినిమాని మా బ్యానర్పై విడుదల చేయడం ఆనందంగా ఉంది. రాజశేఖర్ గత సినిమా 'గరుడవేగ' పెద్ద సక్సెస్ అయ్యింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'అ!' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్కి, టీజర్కి, ఆ తరవాత వచ్చిన కమర్షియల్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అవి సినిమాపై హైప్ పెంచాయి. దీనికున్న క్రేజ్, కంటెంట్ చూసి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయ్యాం. త్వరలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెయిన్ ట్రైలర్ని విడుదల చేయనున్నాం. అది సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 28న సినిమాను విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు ఈ చిత్రానికి ఘన విజయం అందిస్తారని ఆశిస్తున్నాను. రాజశేఖర్ అద్భుతంగా నటించారు. ఆయన కామెడీ టైమింగ్ అలరిస్తుంది. ఈ సినిమా కమర్షియల్ ట్రైలర్లో ఆయన కామెడీ టైమింగ్ను చాలామంది మెచ్చుకున్నారు. అదా శర్మ, నందితా శ్వేత తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. శ్రవణ్ భరద్వాజ్ బ్రహ్మాండమైన ట్యూన్స్, నేపథ్య సంగీతం అందించారు. ఇందులో ఒక ప్రత్యేక గీతం కూడా ఉంది. 'గరుడవేగ'లో సన్నీ లియోన్ 'డియో డియో' సాంగ్ చేసినట్టు, ఇందులో స్కార్లెట్ విల్సన్ 'హార్న్ ఓకే ప్లీజ్' అనే పాటలో నర్తించారు. విడుదలైన పాట ప్రేక్షకులకు మంచి ఉత్తేజాన్ని అందిస్తుంది. అన్ని రకాల హంగులు ఉన్న చిత్రమిది. మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్లు ఉన్న సినిమా తప్పనిసరిగా బాగుంటుంది. ఆ నమ్మకంతోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మా బ్యానర్కి మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిదని భావిస్తున్నాం' అని అన్నారు.