Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమలాపాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'ఆమె'. తమిళంలో 'ఆడై'పేరుతో రూపొందుతున్న చిత్రానికిది తెలుగు అనువాదం. రత్నకుమార్ దర్శకత్వం వహించారు. చరిత చిత్ర ప్రొడక్షన్స్ పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్ విడుదల కార్యక్రమం గురువారం జరిగింది. అతిథిగా విచ్చేసిన హీరో శ్రీకాంత్ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పోస్టర్ విడుదల చేస్తుంటే నాకు 25 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తుంది. నాకు మంచి జీవితాన్ని ఇచ్చిన చిత్రం 'ఆమె'. చరిత చిత్ర ద్వారా నేను హీరోగా మారాను. ఈ బ్యానర్లో రెగ్యులర్గా సినిమాలు చేయమని తమ్మారెడ్డిని చాలా సార్లు అడిగాను. ఇప్పుడు ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అమలా పాల్, తమ్మారెడ్డి, చిత్ర బృందానికి అభినందనలు' అని అన్నారు. 'అబద్ధాలతో కూడిన ఫార్ములా సినిమాలను చేసి బోర్ కొడుతున్న సమయంలో ఈ ఇండిస్టీ నుంచి వెళ్లిపోదామా అనిపించింది. అలాంటి టైమ్లో ఈ స్క్రిప్ట్ వచ్చింది. ఇంగ్లీష్ సినిమాకు కాపీ ఏమోనని అనుకున్నా. కానీ చాలా కొత్తగా ఉంది. ధైర్యంగా నటించాను. ఈ సీన్ చూసి నగత్వం కన్నా, నా కళ్లల్లో ఎక్కువ బాధ కనిపించిందని అనురాగ్ కశ్యప్గారు అన్న మాటలను అంత తేలికగా మర్చిపోలేను. మా నిజాయితీని ప్రశంసిస్తారని ఆశిస్తున్నా' అని అమలాపాల్ తెలిపారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ, '1979లో ఇండిస్టీకి వచ్చాను. మా చరిత చిత్ర పతాకంపై ఈ 40 ఏళ్లల్లో ఎన్నో సినిమాలు చేశాం. కానీ ఈ చిత్రాన్ని చూసి షాక్ అయ్యా. కమర్షియల్గా సక్సెస్ అవుతుందనుకుని ముందు సినిమాలో దిగాం. కానీ చూశాక అసలు ఈ కథని దర్శకుడు ఎలా రాశాడు? ఎందుకు రాశాడు? నిర్మాత ఎలా తీశాడు? అని ఆలోచించా. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ప్యాషన్ ఉండాలి. అమలాపాల్ నటన చూసి మరింత షాకయ్యాను. ఈ జనరేషన్లో ఇంత గొప్పగా నటించిన వాళ్ళు లేరు. ఈ సినిమా చేస్తున్నందుకు గర్వపడుతున్నా. 70 ఏళ్ల క్రితం సుశీలగారు పాడిన ఓ పాటను ఈ సినిమా కోసం మళ్లీ ఆమెతోనే పాడించామని మా దర్శకుడు చెప్పారు. హ్యాపీగా ఉంది. నేను మహిళా ఓరియంటెడ్ సినిమాలు, సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలనే ఎక్కువగా తీశాను. అలాంటి నా జీవితంలో మర్చిపోలేని చిత్రంగా ఇది నిలుస్తుంది. అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేస్తున్నప్పుడు ప్రశంసించాల్సిన స్థాయిలో ఉన్నాం. అది వదిలిపెట్టి ప్రతిదానికీ అమ్మాయిలను ట్రోల్స్ చేయడం సరికాదు' అని చెప్పారు. 'ఈ సినిమా తెలుగులో విడుదలవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ నెల 19న సినిమాని విడుదల చేస్తున్నాం' అని చిత్ర దర్శకుడు తెలిపారు.