Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మహిళా ప్రధానంగా వచ్చిన 'ఓ బేబీ' సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. దీన్ని త్వరలో బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నాం' అని నిర్మాతలు వివేక్ కూచిభోట్ల, సునీత చెప్పారు.
సమంత, నాగశౌర్య, లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ప్రధాన పాత్రధారులుగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఓ బేబీ' చిత్రాన్ని వివేక్ కూచిభొట్ల, సురేష్బాబు, సునీత, థామస్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో శనివారం నిర్మాత సునీత మీడియాతో మాట్లాడుతూ, 'సౌత్ కొరియన్ సినిమా 'మిస్గ్రానీ'కిది రీమేక్. ఆ చిత్ర నిర్మాత థామస్ మన ఇండియాలో ఈ సినిమాని రీమేక్ చేద్దామని వచ్చారు. ఆయనతో నాకున్న పరిచయం వల్ల తెలుగు పరిశ్రమ గురించి చెప్పి ఇక్కడ తీయాలని ప్రోత్సహించాను. అలా ఇది సెట్ అయ్యింది. ఈ కథ చెప్పినప్పుడు సమంత బాగా సూట్ అవుతుందనిపించింది. నందినిరెడ్డిని దర్శకురాలిగా సమంతనే సజెస్ట్ చేశారు. వృద్ధురాలు పాత్రని మొదట సమంతతోనే చేయిద్దామనుకున్నాం. కానీ సహజత్వం రాదని భావించి లక్ష్మిని సంప్రదించాం. కథలో పెద్దగా మార్పులు చేయలేదు, కానీ నేటివిటీ పరమైన మార్పులు మాత్రం చేశాం. సమంత అద్భుతంగా చేసింది. నందినిరెడ్డి అంతే బాగా తెరకెక్కించారు. సినిమాకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దీని గురించి ప్రత్యేకంగా బన్నీ ప్రశంసించడం చాలా సంతోషంగా ఉంది. సినిమాని చైనా, జపాన్, వియత్నాంలో విడుదల చేయాలని అడుగుతున్నారు. చైనాలో భారీ విడుదల ఉండబోతుంది. అలాగే కన్నడ, బెంగాలీ భాషల వాళ్ళు రీమేక్ అడుగుతున్నారు. ప్రస్తుతం హిందీలో రీమేక్ చేసే ప్లాన్లో ఉన్నాం. సినిమాకి నలుగురం నిర్మాతలమైనా సురేష్బాబు లీడ్ తీసుకుని నడిపించారు. ప్రొడక్షన్ పరంగా కూల్గా ఎలా పని చేయించుకోవచ్చో వివేక్ నుంచి నేర్చుకున్నా. ఈ చిత్రాన్ని బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్కి పంపిస్తున్నాం. త్వరలో మూడు ప్రాజెక్ట్లతో రాబోతున్నాం. కాప్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ఒకటి, కొత్త జోనర్లో ఓ సినిమా, క్రైమ్ థ్రిల్లర్గా ఓ సినిమా చేయనున్నాం' అని అన్నారు.
వివేక్ చెబుతూ, 'మేం ఊహించినదానికంటే మంచి స్పందన లభిస్తుంది. సురేష్బాబుతో కలిసి చేయడం వల్ల మాకు లాభాలు ఇచ్చి పని నేర్పించారు. సాధారణంగా ప్రొడక్షన్ అనేది చాలా కష్టమైన పని, కానీ ఆయన ఈజీగా ఎలా చేయోచ్చో చూపించారు. మున్ముందు మా కాంబినేషన్లో మంచి సినిమాలు వస్తాయి. ప్రస్తుతం చేస్తున్న 'వెంకీమామ' 70శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. దసరాకి విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు.