Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇన్నేండ్ల కెరీర్లో దాదాపు 60 సినిమాలకి మాటలు రాసినప్పటికీ 'ఓ బేబీ' మాత్రం నాకు అన్ని రకాలుగా సంతృప్తినిచ్చింది. ఈ చిత్ర విజయానందాన్ని మా అమ్మ, అమ్మమ్మకి అంకితం ఇస్తున్నాను' అని అంటున్నారు మాటల రచయిత లక్ష్మీభూపాల్. 'చందమామ', 'అలా మొదలైంది', 'మహాత్మ', 'టెర్రర్', 'నేనే రాజు నేనే మంత్రి', 'కళ్యాణ వైభోగమే' వంటి తదితర చిత్రాలతో మాటల రచయితగా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీభూపాల్ తాజాగా 'ఓ బేబీ' చిత్రానికి కూడా మాటలు అందించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. సినిమాతోపాటు ఇందులోని మాటలూ చాలా బాగున్నాయనే కాంప్లిమెంట్స్ వినిపించాయి. ఈ సందర్భంగా రచయిత లక్ష్మీభూపాల్ సోమవారం మీడియాతో తన విజయానందాన్ని షేర్ చేసుకున్నారు.
''ఓ బేబీ' విడుదలైన తర్వాత సమంత నటన గురించి, నందినిరెడ్డి దర్శకత్వంతోపాటు నా మాటల్ని కూడా ప్రశసించడం చాలా ఆనందంగా ఉంది. 'సిరివెన్నెల'సీతారామశాస్త్రి, కె.ఎస్.రామారావు వంటి ప్రముఖులతో పాటు పరిశ్రమ నుంచి ఎంతో మంది ఫోన్ చేసి అభినందించడం అనిర్వచనీయ అనుభూతినిచ్చింది. రచయితగా పదిహేనేండ్ల కెరీర్లో దాదాపు 60 చిత్రాలకు మాటల్ని రాశాను. ఇన్నేండ్లలో ఇన్ని సినిమాలకు రాసినా రాని సంతృప్తి ఈ సినిమాకి లభించింది. చిన్నతనంలోనే మా నాన్నగారు మరణించారు. అప్పట్నుంచి నేనెక్కువగా అమ్మ, అమ్మమ్మ సంరక్షణలోనే పెరిగాను. ఈ సినిమాలో నేను రాసిన మాటలన్ని వాళ్ళ నోటి నుంచి జాలు వారినవే. వారి ప్రభావం నాపై అంతగా ఉండబట్టే ఈ సినిమా కథకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాని మా అమ్మతో కలిసి చూశాను. కొన్ని సన్నివేశాలు వస్తున్నప్పుడు అమ్మ నా వైపు చూసేది. అమ్మకి సినిమా చాలా బాగా నచ్చింది. నా కెరీర్లో ఇప్పటి వరకు కృష్ణవంశీ, నందినిరెడ్డి, సతీష్ కాశెట్టి వంటి దర్శకులతో మూడేసి సినిమాలు చేశాను. అయితే స్టార్ హీరోల సినిమాలకి, స్టార్ దర్శకుల సినిమాలకి రాసే అవకాశం ఇప్పటివరకు రాలేదు. ఇకపై వస్తుందని ఆశిస్తున్నా. వచ్చిన అవకాశాలతో రచయితగా నిరూపించుకుంటాననే నమ్మకమూ ఉంది. నేను రైటర్గా వర్క్ చేసిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి. కానీ రచయితగా నేను ఫెయిల్ కాలేదు. ప్రస్తుతం రైటర్స్కి మంచి గుర్తింపు ఉంది. ఈ గుర్తింపుకి, ఆ గుర్తింపుకి తగినట్టు పారితోషికం త్రివిక్రమ్గారి వల్లే వచ్చింది. రైటర్ ఇంత తీసుకొవచ్చు, రైటర్కి ఇంత ఇవ్వొచ్చని ఆయన ఒక పారామీటర్ని సెట్ చేశారు.
రచయితలందరూ దర్శకులుగా మారిపోతున్నారు. మీరెప్పుడు మెగాఫోన్ పడుతున్నారని చాలా మంది అడుగుతున్నారు (నవ్వుతూ). కొంతమంది రచయితలు ప్రస్టేషన్లో దర్శకులు అవుతున్నారు. తాము రాసింది దర్శకులు సరిగా తెరపై ఆవిష్కరించడంలేదనే కోపంలో దర్శకులవు తున్నారు. నేను ప్రస్టేషన్లో, కోపంలో దర్శకుడిని కావాలనుకోవడం లేదు. నేను మాత్రమే కథకు న్యాయం చేయగలనని భావించినప్పుడే మెగాఫోన్ పడతా. ప్రస్తుతం నా దగ్గర 24 కథలున్నాయి. వీటిల్లో కొన్ని నా దర్శకత్వం కోసం దాచుకున్నా. అలాగే కొన్ని చిత్రాలకు మాటలు రాసేందుకు చర్చలు జరుగుతున్నాయి' అని లక్ష్మీభూపాల్ చెప్పారు.