Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తమిళ నిర్మాత మోసం చేయడంతో 'ఆమె' చిత్రాన్ని సరైన టైమ్కి విడుదల చేయలేకపోయాను. దీంతో చాలా రోజుల తర్వాత నిర్మాణం వైపు అడుగులు వేసిన నాకు పెద్ద షాక్ తగిలింది' అని అంటున్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన సమర్పకులుగా విడుదల చేసిన చిత్రం 'ఆమె'. అమలాపాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ, ''ఆమె' ట్రైలర్ చూసినప్పుడు చాలా క్యూరియాసిటీగా అనిపించింది. ఒక అమ్మాయి దర్శకుణ్ణి నమ్మి బట్టలు లేకుండా నటించడం మామూలు విషయం కాదు. సినిమాలో మంచి కంటెంట్ ఉంటుందని
నమ్మి డబ్బింగ్ హక్కులు తీసుకున్నా. కానీ మాకు తెలియకుండానే ఒరిజినల్ నిర్మాత విడుదల తేదీని ప్రకటించారు. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్ని ఇబ్బంది పెట్టారు. దీంతో సినిమా మొదటి షో పడలేదు. ఓ రకంగా సినిమాని చంపేశాడు. ఈ విషయం తెలుసుకుని హీరోయిన్ అమలాపాల్ తన రెమ్యూనరేషన్ తీసుకోకుండా, తనే రిటన్గా ఎగ్జిబిటర్లకు, ఇతరులకు ఇవ్వాల్సిన డబ్బులు కట్టి విడుదల చేయించింది. అయినా మొదటి రోజు విడుదల కాలేదు. సినిమా కోసం బుక్ చేసుకున్న వాళ్ళంతా నిరాశ పడ్డారు. రెండో రోజు విడుదలైనా పెద్దగా ఆదరణ లేదు. దీని వల్ల సినిమా డిజాస్టర్గా మారింది. ఇంత చేసిన నిర్మాతపై ఛాంబర్లో ఫిర్యాదు చేశా. అలాగే కేసు కూడా పెట్టాను. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఇది నాకు పెద్ద గుణపాఠం. ఇన్నేండ్ల అనుభవం ఉన్న నాకే ఇలా జరిగితే కొత్త వాళ్ళ పరిస్థితేంటి అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ప్రజెంట్ జనరేషన్, ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే అంశంతోపాటు మహిళలకు సంబంధించి మంచి సందేశం కూడా ఉంది. అమలాపాల్ అత్యద్భుతంగా నటించింది' అని అన్నారు.