Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూపేష్ చౌదరి, సలోని మిశ్రా జంటగా, పూజా రామచంద్రన్ కీలక పాత్రలో బి.శివ కుమార్ దర్శకత్వంలో మా ఆయి పతాకంపై సుశీలాదేవి నిర్మిస్తున్న చిత్రం '22'. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్ క్లాప్ నివ్వగా,
నిర్మాతలు కొండా కృష్ణంరాజు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, నవీన్ ఎర్నేని సంయుక్తంగా క్లాప్ ఇచ్చారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ, 'మారుతి, పూరీ జగన్నాథ్, వి.వి.వినాయక్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాను. వారి స్ఫూర్తితో ఈ స్థాయికి వచ్చా. మా అమ్మ జయగారు కూడా నేనీ స్థానంలో ఉండేందుకు కారణం. ఆమె దగ్గర డైరెక్షన్, ప్రొడక్షన్ నేర్చుకున్నా. ఆమె ఎక్కడున్నా ఇప్పుడు ఆనందిస్తారు. సుశీలా దేవితో ముందుగా వెబ్ సిరీస్ చేశాం. అది బిజినెస్ ప్రాసెస్లో ఉంది. ఈ క్రమంలో మళ్ళీ ఏం చేయాలను కున్నప్పుడు ఓ కథ చెప్పా. అదే ఈ '22'. మా నాన్న బి.ఏరాజు లేకపోతే నేను లేను. ఆయన ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ చిత్రానికి '22' ఎందుకు పెట్టామనేది ఆసక్తికరం. అది రివీల్ చేస్తే కిక్ పోతుంది. ట్విస్ట్లు, టర్న్లతో సాగుతుంది. మర్డర్ మిస్టరీ ప్రధానంగా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా సాగే చిత్రమిది. ఈ నెల 29 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. డిసెంబర్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వెంకటేష్, సాయిధరమ్ తేజ్, హరీష్ శంకర్ వంటి వారికి ధన్యవాదాలు' అని అన్నారు. హీరో రూపేష్ చెబుతూ, 'మంచి ఆర్టిస్టు అవ్వాలని చిన్నప్పట్నుంచి ఉండేది. అమిత్ కజిన్. ఆయన సలహా మేరకు ఆనీ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకున్నా. ఆనీ మాస్టర్ ఈ సినిమాని సెట్ చేశారు. మొదట దర్శకుడు శివతో వెబ్ సిరీస్ చేశాం. ఇప్పుడు సినిమా చేయడం ఆనందంగా ఉంది. నా అభిమాన హీరో వెంకటేష్ ఈ చిత్రానికి క్లాప్ నివ్వడం మరింత ఆనందంగా ఉంది' అని చెప్పారు. 'అమిత్ వల్ల రూపేష్ దొరికాడు. తనకి యాక్టింగ్పై ఎంతో ప్యాషన్ ఉంది. మంచి దర్శకుడితో సినిమా చేయాలనుకున్నప్పుడు శివ గుర్తుకొచ్చారు. శివ ఎప్పుడూ వర్క్ యాటిట్యూడ్తో ఉంటారు. కచ్చితంగా మంచి హిట్ చిత్రాన్ని తీస్తారని నమ్ముతున్నా' అని ఆనీ మాస్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కో డైరెక్టర్ పుల్లారావు, కెమెరామెన్ రవి, ఆర్ట్ డైరెక్టర్ రాజు,
సునిత శర్మ, పూజా రామచంద్రన్, సలోని తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.