Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కెరీర్ ప్రారంభంలో పతి ఒక్క దర్శకుడు నాతో సినిమా చేయాలని, నా కోసం కథలు రాసే స్థాయికి చేరుకోవాలనే ఎలాగైతే గోల్ పెట్టుకున్నానో, ఇప్పుడు కూడా ఉన్న స్థానం నుంచి పడిపోకుండా, మళ్ళీ దర్శకుల కోసం నేను వెతుక్కునే పరిస్థితి రాకూడదనే గోల్ పెట్టుకున్నాను' అని అంటున్నారువిజయ్ దేవరకొండ. భరత్ కమ్మ దర్శకత్వంలో ఆయన తాజాగా నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రం ఈ నెల 26న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన
మాటల్లోనే ..
భరత్ ఈ కథ చెప్పినప్పుడు ప్రేమ కోసం ఫైట్ చేయడం, అందులోని ఎమోషన్ నచ్చింది. ముఖ్యంగా నేను నటిస్తున్న బాబీ పాత్ర, రష్మిక నటిస్తున్న లిల్లీ పాత్రల జర్నీ బాగా కనెక్ట్ అయ్యింది. సినిమాలో మా ఫాదర్ కమ్యూనిస్ట్. దీంతో చిన్నప్పట్నుంచి ఆ భావాలతో పెరగడంతోపాటు కాలేజ్లో ఓ విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఉంటా. చాలా అగ్రెసివ్, టెంపర్మెంట్ యాటిట్యూడ్ వల్ల ఎక్కడైన తప్పు జరిగితే ప్రశ్నిస్తుంటాను. ఈ క్రమంలో అనేక స్ట్రగుల్స్. ప్రేమ, విఫలం, మళ్ళీ కలవడం, ఇదంతా నా పాత్ర జర్నీ. అలాగే రష్మిక నటించిన లిల్లీ క్రికెట్లో స్టేట్ ప్లేయర్. ఆమె నన్ను, నేను ఆమెని ఎలా ప్రభావితం చేశాం. ఎలా ప్రేమలో పడ్డాం. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర సన్నివేశాల సమాహారమే సినిమా. చాలా ఎమోషనల్గా ఉంటుంది. సినిమా చూసి ఇంటికెళ్ళినా ఆలోచించేలా మంచి సందేశాన్ని కూడా ఇస్తుంది.
సినిమాలో బాబీ పాత్రలా ఎంత మంది అబ్బాయిలు ఉంటారో తెలియదు. కానీ లిల్లీలా మాత్రం ప్రతి అమ్మాయి ఉంటుంది. ప్రతి అమ్మాయి ఆ పాత్రకి బాగా కనెక్ట్ అవుతారు. రష్మికతో 'గీత గోవిందం'తో కలిసి నటించడంతో మా మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.దర్శకుడు భరత్ కమ్మ లఘు చిత్రం చూసి ఆయన్ని కలిశాం. ఈ కథ చెప్పిన విధానం బాగా నచ్చింది. కొత్తవాడైనా బాగా తీయగలడనే నమ్మకం ఉంది. అవుట్పుట్పై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. షూటింగ్ మధ్యలోనే సినిమాని నాలుగు భాషల్లో విడుదల చేస్తే బాగుంటుందని అనిపించింది. అందుకు మా నిర్మాతలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఓ తెలుగు సినిమా నాలుగు భాషల్లో విడుదల కావడం ఇదే మొదటిసారి.
మ్యూజికల్గా, కథ పరంగా, డైలాగ్ల పరంగా నా మనసుకి బాగా దగ్గరైన చిత్రమిది. అందుకే ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నా. 'పెళ్ళిచూపులు' నుంచి మా సినిమాలని మేమే ప్రమోట్ చేసుకోవాల్సి వచ్చేది. వేరే ఆప్షన్ లేదు. ఈ సినిమాకి రెగ్యులర్ ప్రమోషన్ కాకుండా డిఫరెంట్గా చేయాలనిపించింది. పైగా నా కెరీర్లో ఇది బెస్ట్ ఆల్బమ్. పాటలను ఆడియెన్స్తో కలిసి ఎంజాయ్ చేయాలనిపించింది. ఆడియెన్స్ నా సినిమాలను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో ఈ సెలబ్రేషన్ చేసుకోవాలిపించి మ్యూజిక్ సెలబ్రేషన్ కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. బెంగుళూరు, కొచ్చి, చెన్నై, హైదరాబాద్లో చేసిన మ్యూజిక్ ఫెస్టివల్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
కెరీర్ ప్రారంభంలో ప్రతి ఒక్క దర్శకుడు విజయ్ తో సినిమా తీయాలనుకునే స్థాయికి ఎదగాలని గోల్గా పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ దర్శకుల కోసం వెతుక్కునే స్థాయికి వెళ్లొద్దని కోరుకుంటున్నా. నాకు వచ్చిన ఈ ఇమేజ్ వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ నాకు ఏది అనిపిస్తే అది చేస్తున్నా. ఫలితం గురించి ఆలోచించడం లేదు. ఇమేజ్ అనేది ఫ్యాన్స్, ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అది శాశ్వతం కాదు. ఏదైన తేడా వస్తే ఒక్కసారిగా పోతుంది. 'అర్జున్రెడ్డి' హిందీ రీమేక్లో నటించమన్నారు. చేసిన దాన్ని మళ్ళీ ఏం చేస్తాం. అది నాకిష్టం ఉండదు. ఒక్కసారి చేసిన సినిమాని మళ్ళీ ఎప్పుడూ చేయలేను. బాలీవుడ్లో మన వాళ్ళు సత్తా చాటడం ఆనందంగా ఉంది. 'బాహుబలి'తో దేశ వ్యాప్తంగా మనమేంటో చూపించాం. 'కబీర్ సింగ్'తో సందీప్ సత్తా చాటి బాలీవుడ్ మేకర్స్కి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు సుజిత్ 'సాహో'తో తన హవా చూపించబోతున్నారు. కన్నడ సినిమా 'కేజీఎఫ్' ఓ రేంజ్లో ఆకట్టుకుంది. వారితోపాటు శంకర్, మణిరత్నం వంటి వారు దేశ వ్యాప్తంగా మనమేంటో చూపిస్తున్నారు. అలా నేను కూడా ఇక్కడ్నుంచే ఏదైనా చేయాలనుకుంటాను. ఇటీవల యువ హీరోలు నన్ను ఫాలో అవుతున్నారని అంటున్నారు. వాళ్ళకి నా అభినందనలు. కానీ టాలెంట్, ఇంటెలిజెన్స్, ప్యాషన్ ఉంటే ఎవరికి వారే సొంతంగా ట్రెండ్ క్రియేట్ చేయగలరు. ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.