Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలీ, రిషిత, వినోద్ కుమార్, బాబు మోహన్ ప్రధాన పాత్రధారులుగా దిలీప్ రాజా దర్శకత్వంలో పెదరావూరు ఫిల్మ్స్ సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'పండుగాడి ఫొటో స్టూడియో' (వీడు ఫొటో తీస్తే పెళ్ళి అయిపోద్ది). ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల ఘనంగా జరిగింది. ఆడియో సిడీని ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్, బోయపాటి శ్రీను సంయుక్తంగా విడుదల చేశారు. ట్రైలర్ను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ, 'నా మీద అభిమానంతో ఈ వేడుకకు వచ్చిన వారందరికీ థ్యాంక్స్. ఒక రోజు ఇన్ కమ్ టాక్స్ కమిషనర్ కాల్ చేసి ఆఫీసుకు రమ్మన్నారు. ఇన్ కమ్ టాక్స్ విషయం అనుకున్నా, కానీ 'నా ఫ్రెండ్ ఒకరు సినిమా చేస్తున్నారు. మీరు అందులో యాక్ట్ చేయాల'ని అడిగారు. ఆయనే దిలీప్ రాజా. ఇందులోని పాటలు నచ్చి నటించేందుకు ఒప్పుకున్నా. కథ కూడా చాలా బాగుంది. సాంబిరెడ్డి సినిమాలపై ఇష్టంతో నాపై నమ్మకంతో అనుకున్న బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేశారు. అందరికీ నచ్చేలా ఉంటుందని ఆశిస్తున్నా' అని అన్నారు. 'మొదటిసారిగా మా బ్యానర్లో అలీగారి సపోర్ట్తో ఈ సినిమాని నిర్మించడం ఆనందంగా ఉంది. కుటుంబ సమేతంగా చూసి ఆనందించి, ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నా. మా బ్యానర్లో రెండో చిత్రంగా స్టార్ హీరో మమ్ముట్టిగారు నటించిన ఓ చిత్రంతో సెప్టెంబర్లో మీ ముందుకు రానున్నాం' అని నిర్మాత సాంబిరెడ్డి చెప్పారు. చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ, 'రెండు సంవత్సరాలు ఈ కథ కోసం కష్టపడ్డాను. దర్శకుడు సుకుమార్ గ్రీన్సిగల్ ఇచ్చిన తర్వాతే తెరకెక్కించాం. జంధ్యాల మార్క్ కామెడీతో రూపొందించాం. ఆలీగారు హీరోగా రీఎంట్రీ ఇస్తున్నారు' అని చెప్పారు.