Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యోగేశ్వర్, అతిథి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జి.వి.వి గిరి నిర్మిస్తున్న చిత్రం 'పరారి'. 'రన్ ఫర్ ఫన్' అనేది ట్యాగ్లైన్. తాజాగా హైదరాబాద్లోని ఓ పబ్లో 'గరమ్ గరమ్ మురిగి మసాలా' అనే ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు. ఈ పాటతో చిత్రీకరణ మొత్తం పూర్తయిన నేపథ్యంలో గుమ్మడికాయ కొట్టారు. ఈ పాటలో యోగేశ్వర్, ముంబాయికి చెందిన డాన్సర్ మినాల్ నర్తించారు. భాను కొరియోగ్రఫి అందించారు. రవి అంబట్ల గీతాన్ని అందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయి శివాజీ మాట్లాడుతూ, 'కుటుంబ నేపథ్యంగా పూర్తిస్థాయి వినోదాత్మకంగా సినిమాని రూపొందిస్తున్నాం. యూత్కి కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు సందేశం కూడా ఉంటుంది. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మాతలు చాలా క్వాలిటీగా తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్తోపాటు బ్యాంకాక్లో చిత్రీకరణ జరిపాం. హీరోగా పరిచయం అవుతున్న యోగేశ్వర్ బాగా నటించాడు. సహకరించిన చిత్ర బృందానికి థ్యాంక్స్' అని అన్నారు. 'నేను సుమన్గారి అభిమానిని. సినిమాలో ఆయన కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. హాస్యనటుడు అలీ మంచి పాత్రలో కనిపిస్తారు. సస్పెన్స్, థ్రిల్తో సాగే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి' అని నిర్మాత గిరి తెలిపారు. హీరో యోగేశ్వర్ చెబుతూ, 'సినిమా సక్సెస్ఫుల్గా పూర్తయ్యింది. దర్శకుడు అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. కచ్చితంగా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది' అని అన్నారు.