Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సాహో' ప్రీ రిలీజ్ వేడుకలో కృష్ణంరాజు
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్కీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సాహో'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం ఆర్ఎఫ్సీలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, 'సాధారణంగా ఏ హీరో ఫ్యాన్స్ అయినా తమ హీరో సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటారు. కానీ అందరి హీరోల ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా హిట్ కావాలని కోరుకుంటారు. తను ఎవరి గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడడు. అదే తనకి అంత మంది ఫ్యాన్స్ని సంపాదించి పెట్టింది. ప్రభాస్కి దూరదృష్టి ఎక్కువ. 'బాహుబలి' సినిమా కథ చెప్పినప్పుడు తర్వాత సినిమా ఏంటని? చాలా తపన పడ్డాడు. ఓ రోజు ఎగ్జైటింగ్గా వచ్చి సుజిత్ కథ చెప్పాడు, అద్భుతంగా ఉందన్నాడు. 'బాహుబలి' తర్వాత మరో పెద్ద డైరెక్టర్తో సినిమా చేయాలని కాకుండా సుజిత్ చెప్పిన కథని నమ్మి ఈ సినిమా చేశాడు. సుజిత్ చాలా చిన్న కుర్రాడు. ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేయగలడా? లేదా? అని చాలా మంది అనుకున్నారు. టీజర్ కన్నా ముందు ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే చాలా మందికి అర్థమైపోయుండాలి. సుజిత్ సామర్థ్యం ఏంటో. పెద్ద టెక్నీషియన్స్, భారీ బడ్జెట్ని, ప్రభాస్లాంటి ఆల్ ఇండియా స్టార్ని హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు. తనే బ్యాక్బోన్లా ఉన్నాడు. తన భుజాలపైనే సినిమా నిలబడింది. తనకు మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రమోద్, వంశీలకు సింహాలు, పులులకు ఉండే గుండె ఉండాలి. ప్రభాస్ ఏమడిగితే అదిచ్చారు. ఆగస్ట్ 30న ఈ సినిమా చాలా పెద్ద రేంజ్ రికార్డులు సాధిస్తుంది. నిర్మాతలకు వాళ్లు పెట్టినదానికి డబుల్, ట్రిపుల్ రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
'చాలా హ్యాపీగా ఉంది. టీజర్, ట్రైలర్స్ వచ్చాక ప్రభాస్ కాసేపు కనిపించి ఉంటే బాగుండేదని చాలా ఫోన్లు వచ్చాయి. టీజర్ విడుదల తర్వాత ఆహో, ఓహో అన్నారు. ట్రైలర్ విడుదల తర్వాత అబ్బో అన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. హాలీవుడ్ సినిమాలకు పోటీనివ్వబోతోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. సుజిత్ చిన్నవాడైనా అతనిపై నమ్మకంతో, కథపై నమ్మకంతో నిర్మాతలను పిలిచి ప్రభాస్ సినిమా చేస్తానని ఒప్పించడం తన అదృష్టం. నా 45 ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. సినిమా 150 శాతం అభిమానుల అంచనాలను మించేలానే ఉంటుంది. మరో 'బాహుబలి' అంత పేరు వచ్చి ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడనే నమ్మకంతో ఉన్నా' అని కృష్ణంరాజు తెలిపారు.
ప్రభాస్ మాట్లాడుతూ, 'ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ డైలాగ్స్ రాసింది డైరెక్టర్ సుజితే. తనకు మాస్ పల్స్ బాగా తెలుసు. కెమెరామెన్ మది, అలాగే సాబుసిరిల్ ఎంతో బాగా వర్క్ చేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్గారు చేసిన సాయం చాలా పెద్దదే. కమల్ కణ్ణన్ సినిమాకు ఇంటర్నేషనల్ లుక్ తీసుకొచ్చారు. జిబ్రాన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు.
జాకీ షరాఫ్, చుంకీ పాండే, అరుణ్ విజరు, లాల్, నీల్ నితిన్
ముఖేష్ ఇలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్లా మారిపోయారు. సుజిత్ కథ చెప్పేటప్పుడు తన వయసు 23ఏళ్లు. కానీ నాకు ఓ నలభై ఏళ్ల వ్యక్తిలా కథ చెప్పాడు. సినిమా చిత్రీకరణ సమయంలో పెద్ద పెద్ద స్టార్స్, టెక్నీషియన్స్ను ఎలా హ్యాండిల్ చేస్తాడోనని అనుకున్నాను. తను హ్యాండిల్ చేసిన విధానానికే గ్రేటెస్ట్ డైరెక్టరే కాదు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోతాడనిపిస్తుంది. శ్రద్ధా కపూర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది. శ్రద్ధాకపూర్లాంటి హీరోయిన్ మా సినిమాకి దొరకడం అదృష్టం. యాక్షన్ సీన్స్ ఇరగదీసింది. గత సినిమా సమయంలో ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని మాటిచ్చా. మిస్సయ్యాం. కానీ ఈసారి మాట ఇవ్వకుండా ఏడాదికి రెండు సినిమాలు చేయాలనుకుంటున్నాను. వంశీ, ప్రమోద్, విక్కీ వందకోట్ల లాభం వదులుకుని ఈ సినిమా చేశారు. వాళ్ళు మంచి స్నేహితులు'అని తెలిపారు.
చిత్ర దర్శకుడు సుజిత్ చెబుతూ, 'ఫ్యాన్స్ అందరికీ ఉంటారు. కానీ ప్రభాస్కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. 'బాహుబలి' తర్వాత ఈ సినిమా కోసం రెండేండ్లు వెయిట్ చేశారు. 'మిర్చి' సమయంలో నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి ప్రభాస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను నమ్మలేదు. అందుకే వెళ్ళలేదు. తర్వాత కలిసినప్పుడు అదేంటి డార్లింగ్ అప్పుడెప్పుడో పిలిస్తే రాలేదు అన్నారు. తర్వాత ఈ సినిమా కుదిరింది.నన్ను నమ్మినందుకు, 'నువ్వు తీయగలుగుతావ్' అని నాలో ధైర్యం నింపిన ప్రభాస్కి థ్యాంక్స్. టెక్నీషియన్లందరికి ధన్యవాదాలు. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీలు నా అన్నయ్యల్లా నా పక్కన నిలబడ్డారు. నాపై ఎలాంటి ప్రెషర్ లేకుండా చూసుకున్నారు. ఇంత మంచి నిర్మాతలను చూడనేమో. హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలని అనుకున్నప్పుడు శ్రద్ధాకపూర్ అయితే బాగుంటుందని అనుకున్నాం. తను ఎంత కష్టపడిందో ట్రైలర్ చూస్తే అర్థమై ఉంటుంది. రేపు సినిమాలోనూ చూస్తారు. ఆర్టిస్టులందరికి థ్యాంక్స్' అని చెప్పారు.
'మన ప్రభాస్. యు.వి.క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీలకు మనుషులకు ఉండే గుండె కాదు, సింహాలు, పులలకు ఉండే గుండె ఏదో ఉండి ఉంటుంది. వారికి ఏ మాత్రం భయం లేదు. అందుకు కారణం వారి వెనక ప్రభాస్ ఉన్నాడనే ధైర్యం. ప్రభాస్ను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళతారనే ధైర్యం. సుజిత్కి ఆల్ ది బెస్ట్. 'బాహుబలి' తర్వాత ఈ సినిమాకి కూడా ప్రపంచం అంతా మాట్లాడుకోవాలను కుంటున్నాను. ప్రభాస్ మీ అందరికీ హీరోగానే తెలుసు. మా అందరికీ తనో గొప్ప స్నేహితుడు. తనలాంటి ఫ్రెండ్ మన జీవితంలో ఉంటే మనకేం అవసరం లేదు. సినిమా ట్రైలర్ చూసి ఆల్ రెడీ పిచ్చెక్కిపోయింది. ఇప్పుడు సాంగ్ పిచ్చెక్కింది. ఇప్పటి వరకు హిందీలో రూ.42కోట్లు షేర్ వచ్చింది. అదే హయ్యస్ట్ అంటున్నారు. ఈ సినిమాకు రూ.50కోట్లు షేర్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మన ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినందుకు హ్యాపీగా ఉంది' అని వి.వి.వినాయక్ తెలిపారు.