Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిలో జరిగిన 'సైరా..నరసింహారెడ్డి' ప్రెస్మీట్లో చిరంజీవి
'ఇది చరిత్ర మరచిపోయిన వీరుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథ. ఇలాంటి వీరుడి కథను మనం దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది' అని చిరంజీవి అన్నారు. మొదటితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తుండగా, ఆయన సరసన నయనతార నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, విజరు సేతుపతి, సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా ముఖ్య పాత్రలు పోషించారు. సురేందర్రెడ్డి దర్వకత్వంలో సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై రామ్చరణ్ నిర్మించారు. చిరంజీవి పుట్టిన రోజు(ఈ నెల 22)ని పురస్కరించుకుని మంగళవారం ముంబయిలో చిత్ర టీజర్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, 'ఈ సినిమా చేయాలని దాదాపు పదిహేనేండ్లుగా ప్రయత్నిస్తున్నాం. బడ్జెట్ పరిమితుల వల్ల ఆగిపోయింది. రామ్చరణ్, సురేందర్రెడ్డి ముందుకు రావడంతో నా కల నెరవేరింది.
1999లో వచ్చిన 'ఆజ్ కా గూండారాజ్' తర్వాత హిందీలో నటించలేదు. ఈ గ్యాప్ కారణమేంటనేది నాకూ తెలియదు. మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ రాలేదు. అదీ ఓ కారణమైతే, నేను రాజకీయాల్లోకి వెళ్ళడం మరో కారణం. రీఎంట్రీ తర్వాత బాలీవుడ్కి రావడానికి ఇదే సరైన సినిమా అనిపించింది. అమితాబ్గారు నా రియల్ లైఫ్ మెంటర్. ఇండియాలో మెగాస్టార్ అంటే అమితాబ్ బచ్చన్గారే. ఆయన్ని ఎవరూ రీచ్ కాలేరు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఈ సినిమాలో నా గురువు పాత్రకు అమితాబ్ బచ్చన్గారైతే బావుంటుందని డైరెక్టర్ సురేందర్ రెడ్డి అన్నారు. నేను అడగ్గానే వారం రోజులు కాల్షీట్స్ కేటాయించారు. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమాల్లో దాదాపు పదేండ్లు లేను. ఈ కాలంలో సినిమాల్లో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు సినిమాకి నెగిటివ్ ఉండేది. కానీ ఇప్పుడు అవేం కనపడటం లేదు. నా 150వ సినిమా చేసేటప్పుడు అంతా కొత్తగా అనిపించింది. కానీ సినిమాలో కంటెంట్, ఎమోషన్స్లో మార్పు లేదు' అని అన్నారు.
'ఈ సినిమా గొప్ప ప్రయత్నం. పాన్ ఇండియా సినిమా ఇది. నాన్నగారు ఇంట్లో ఒకలా, మేకప్ వేసుకున్నప్పుడు ఒకలా ఉంటారు. ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతారు. హిందీలో నటించకపోవడానికి కారణం మంచి కంటెంట్ ఉన్న కథలు రాకపోవడం వల్లే. ప్రస్తుతం నటిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్'తో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తాను' అని రామ్ చరణ్ తెలిపారు.
తమన్నా మాట్లాడుతూ, 'హిస్టారికల్ ఫిల్మ్. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైనది. ఇందులో నేను భాగం కావడం చాలా హ్యాపీగా, గర్వంగా ఉంది. నేను తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పుడే చిరంజీవిగారితో కలిసి నటించాలనుకున్నా. అది ఇప్పటికి నెరవేరింది. సినిమా కోసం చరణ్ ఎంతో కష్టపడ్డారు. పెద్ద పెద్ద స్టార్స్తో కలిసి నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు.
చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, 'నా వెనుక చిరంజీవిగారు, చరణ్ ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను పూర్తి చేయగలిగాను. అమితాబ్, చిరంజీవి వంటి స్టార్స్తో వర్క్ చేయడం ఛాలెంజింగ్గానే అనిపించింది. వాళ్ళు నాకు కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేశారు. దాని వల్ల సినిమా చేయడం చాలా సులభమైంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజరుసేతుపతి, సుదీప్, రవికిషన్, సంగీత దర్శకుడు అమిత్ త్రివేది, ఫర్హాన్ అక్తర్, రితేష్ అద్వానీ, అనిల్ టడానీ తదితరులు పాల్గొని మరిన్ని చిత్ర విశేషాలను తెలిపారు.