Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నిర్మాతల కష్టాన్ని పైరసీ వృధా చేస్తుంది. దీన్ని నివారించేలా రూపొందిన డిజిటల్ సినిమా సేవలు రానుండటం శుభపరిణామం. దీన్ని అందరు సపోర్ట్ చేయాలి. ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన బసిరెడ్డికి కృతజ్ఞతలు' అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు సి.కళ్యాణ్ అన్నారు.
పైరసీని తలదన్నే డీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ డెమోను ఏఎంబీ సినిమాస్లో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎఫ్డీసీ చైర్మెన్ పి.రామ్మోహన్రావు మాట్లాడుతూ, 'తెలుగు ఫిల్మ్ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారితో పైరసీని అరికట్టడం గురించి చర్చించనున్నాం. ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. డిజిటల్ డెలివరీ రేట్స్ నిర్మాతలందరికీ అందుబాటులో ఉండాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇండిస్టీలో అందరూ నా ప్రపోజల్ను ఒప్పుకొని సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం' అని అన్నారు.
'నిర్మాతలందరినీ పైరసీ అన్యాయం చేస్తుంది. దీని నిర్మూలన కోసం దాదాపు రెండేండ్లు ప్రయత్నం చేస్తూ డిజిక్వెస్ట్ సంస్థ ముందుకొచ్చింది. పైరసీ ప్రొటెక్షన్ ఇందులో ఇమిడి ఉండడం విశేషం. దీంతోపాటు దీని రెవిన్యూ అనుబంధ తెలుగు చలన చిత్ర సంస్థలు సమానంగా పంచుకుంటాయి. టీ ఎఫ్డీసీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ సమాన భాగస్థులుగా దీన్ని ముందుకు తీసుకెళుతుంది. రామ్మోహన్రావు ఈ విషయం పట్ల పటిష్టంగా ఉన్నారు. దీని ద్వారా తెలుగు పరిశ్రమకు మేలు చేయాలని ఆయన కోరుకుంటున్నారు' అని డిజిక్వెస్ట్ అధినేత కె.బసిరెడ్డి చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కె.మురళి మోహన్, కార్యదర్శి సునీల్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రెటరీ మోహన్ వడ్లపట్ల, బాలా గోవింద్ (సుదర్శన్ థియేటర్), దామోదర్ ప్రసాద్, దర్శకుడు వీరశంకర్ తదితరులు పాల్గొన్నారు.