Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లవర్స్ డే'లో కన్నుగీటి దేశవ్యాప్తంగా పాపులరైన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'శ్రీదేవి బంగ్లా' చిత్రం వివాదంలో ఉంది. ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్లో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ బాత్టబ్లో పడి చనిపోయినట్టు చూపించారు. అతిలోక సుందరి, నిర్మాత బోనీ కపూర్ భార్య శ్రీదేవి కూడా అలానే బాత్టబ్లో పడి చనిపోయిన విషయం విదితమే. తన భార్య చనిపోయినట్టుగా ఉన్న సన్నివేశాల్ని ఇందులో చూపించడం పట్ల నిర్మాత బోనీ కపూర్ మండిపడ్డారు. చిత్ర దర్శక, నిర్మాతలకు నోటీసులు పంపించారు. అయినా చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన ఈ సినిమాని నిలిపి వేసేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. దీని కోసమై కోర్ట్లో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. 'సినిమా టైటిల్, ఫస్ట్లుక్ చూసినప్పుడే బోనీ కపూర్ యూనిట్కి నోటీసులు పంపారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. సినిమాలో ఎలాంటి సన్నివేశాలు చూపించాలనేది వారిష్టం. కానీ టైటిల్లో మాత్రం శ్రీదేవి పేరు ఉండకూడదని బోనీకపూర్ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో సల్మాన్ సోదరుడు అర్బాజ్ఖాన్ గెస్ట్ పాత్రలో నటిస్తుండటం విశేషం. అయితే శ్రీదేవి మరణం ఇప్పటికీ మిస్టరీగా ఉండటంతో ఈ అంశానికి సంబంధించి తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో శ్రీదేవి మరణం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదే అంశంతో 'శ్రీదేవి బంగ్లా' తెరకెక్కుతోందని సమాచారం.