Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాయల్ రాజ్పుత్, తేజస్ కంచర్ల జంటగా శంకర్ భాను దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ''ఆర్ డీఎక్స్ లవ్'. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు వి.వి.వినాయక్ ట్రైలర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'భానుశంకర్ నాతోపాటు దర్శకుడు కావాల్సింది. కానీ అనుకున్న సక్సెస్ రాలేదు. ఈ సినిమాతో బ్రేక్ రావాలని కోరుకుంటున్నా. భానుకి అవకాశం ఇచ్చిన సి.కళ్యాణ్కి థ్యాంక్స్. పాయల్ రాజ్పుత్కి విజయశాంతి అంతటి పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నయ్య సి.కళ్యాణ్కి సినిమా అంటే విపరీతమైన ప్యాషన్. అందుకే లాభనష్టాలకు అతీతంగా ఎప్పుడూ ఏదో ఒక సినిమా తీస్తూనే ఉంటారు. మంచి సినిమా తీయడం కోసం తపిస్తారు. తేజస్కి అభినందనలు. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'ఈ చిత్ర టీజర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాలుగు మిలియన్ వ్యూస్ని రాబట్టుకుంది. 'ఆర్ఎక్స్ 100' ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో, దాన్ని మించేలా ఈ సినిమా ఉండాలనుకున్నాం. అందుకే టీజర్ని బోల్డ్గా విడుదల చేశాం. అయితే సినిమా ఎలా ఉంటుందో అని తెలియడం కోసం ఈ ట్రైలర్ని విడుదల చేశాం. తన ఊరుతోపాటు మరికొన్ని ఊర్ల ఆశయం కోసం, తన తల్లి ఆశయం కోసం విద్యావంతురాలైన ఓ అందమైన అమ్మాయి తన శీలాన్నే త్యాగం చేసిన కథాంశంతో రూపొందించిన చిత్రమిది. సెన్సార్ పూర్తయ్యింది. త్వరలో మంచి డేట్ చూసుకుని విడుదల చేస్తాం' అని నిర్మాత సి.కళ్యాణ్ అన్నారు.
దర్శకుడు శంకర్ భాను మాట్లాడుతూ, ''ఈ కథ విన్నప్పట్నుంచి నిర్మాత కళ్యాణ్ ప్రోత్సహించారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా క్వాలిటీ విషయంలో రాజీపడకుండా నిర్మించారు. మా ట్రైలర్ని విడుదల చేసిన వినాయక్కి థ్యాంక్స్. కెమెరామెన్ రాంప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా సినిమాకి మెయిన్ పిల్లర్స్. కమర్షియల్గా సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని తెలిపారు. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ చెబుతూ, 'ఆర్ ఎక్స్ 100' నా జీవితాన్నే మార్చేసింది. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి ఆదరణ పొందింది. నెగటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. వాటికి ఈ ట్రైలర్ సమాధానం చెబుతుంది. డిఫరెంట్ జోనర్లో సాగే సందేశాత్మక చిత్రమిది. వినోదాన్ని పంచుతూనే సందేశం ఇస్తూ, ఎడ్యూకేట్ చేస్తుంది. ఇన్స్పైర్ చేస్తుంది. సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు.
హీరో తేజస్ చెబుతూ, 'టీజర్పై నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ ఏ తెలుగు హీరోయిన్ చెప్పనంతగా బోల్డ్ డైలాగులు పాయల్ చెప్పింది. ఈ ట్రైలర్తో సినిమాపై అందరి అభిప్రాయం మారిపోతుంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టి. రామసత్యనారాయణ, ఎం.ఎస్.ఎన్.రెడ్డి, పరుశురామ్ తదితరులు పాల్గొన్నారు.