Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొక్కల పెంపకం ద్వారా వాన నీటిని సంరక్షించుకోవాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన పిలుపును ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేందుకు గీత రచయిత అనంత శ్రీరామ్, గాయని స్మిత సంయుక్తంగా ఓ పాటని రూపొందించారు. కావేరి నది సంరక్షణ కోసం, నది జలాల ఆవశ్యకత నేపథ్యంలో తయారైన ఈ పాటను సోమవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గేయ రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ,'దేనినైనా కాపాడుకోవాలి అని చెప్పడం చాలా తేలిక. కానీ పరిష్కారాన్ని చూపడమే నాయకుడి లక్షణం. అటువంటి పరిష్కారాన్ని చూపిన నాయకుడిని అనుసరించడం మన బాధ్యత. మన దేశంలో అడుగంటిపోతున్న నదుల పరిరక్షణకు స్పందించి 'ర్యాలీ ఫర్ రివర్' అనే నినాదంతో కార్యాచరణలోకి పెట్టిన తొలి వ్యక్తి జగ్గి వాసుదేవ్. ఆయన చేస్తున్న బృహత్తర కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించేందుకు మావంతు ప్రయత్నంగా ఈ పాటని రూపొందించాం' అని చెప్పారు.
'రాసిన పాట విన్నాక, లిరిక్స్ చూశాక.. ఇంత అద్భుతమైన పాటను చేయకుండా ఉండలేక పోయాను. సద్గురు బృహత్తర కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయటానికి ఈ పాట పాడాను. అలాగే నా వంతు 500 చెట్లను, భారతీయం తరఫున గొట్టిపాటి సత్యవాణి 500 చెట్లను ఈషా ఫౌండేషన్కి ఇస్తున్నాం' అని గాయని స్మిత చెప్పారు.