Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎల్లువచ్చి గోదారమ్మా...' పాటని రీమిక్స్ చేసి నన్ను 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. ఈ పాట చూస్తుంటే నాకు మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వెయ్యి బిందెలతో చేసిన ఈ పాట ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. ఈ పాటకి ఇంత స్థాయిలో కీర్తి, ప్రతిష్టలు రావడానికి రామానాయుడుగారు, వేటూరిగారు, చక్రవర్తిగారే కారణం. ఈ పాటకి మిక్కీ అత్యద్భుతంగా సంగీతమందించారు. అలాగే ఈ పాటలో శోభన్బాబు, శ్రీదేవిని వరుణ్తేజ్, పూజా హెగ్డే మరిపించారు. ఈ పాట ఉన్న 'దేవత' సినిమా మాదిరిగానే 'వాల్మీకి' సినిమా 25 వారాలు దిగ్విజయంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చెప్పారు. వరుణ్తేజ్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వాల్మీకి'. ఈ చిత్రం కోసం 'దేవత' చిత్రంలోని ' ఎల్లువచ్చి గోదారమ్మా..' పాటను రీమిక్స్ చేశారు. ఈ పాటను మంగళవారం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమక్షంలో వీడియో ప్రోమోను రిలీజ్ చేశారు. ఈనెల 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా వరుణ్తేజ్ మాట్లాడుతూ,'పాటలు, డాన్స్ నాకు కంఫర్ట్ జోన్ కాదు. హరీష్ ఈ సినిమా కథ చెప్పి ఒక రీమిక్స్ సాంగ్ ఉందన్నారు. నేను మా ఫ్యామిలీలో ఎవరి పాట ఉంటుందో అనుకున్నాను. శోభన్బాబు, శ్రీదేవిగారి పాట అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ పాటను అలాగే రీ-క్రియేట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేను ఎస్పీ బాలసుబ్రమణ్యంకి వీరాభిమానిని. 'ముకుంద' సినిమాలో ఆయనతో ఒక పాట పాడించాలని నేను, మిక్కీ అనుకున్నాం. కానీ కుదరలేదు. ఇప్పుడు ఆయన ఈ పాట మళ్ళీ పాడటం మా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం రాఘవేంద్రరావుగారి సినిమాలు, పాటల వైభవం అలాగే ఉంటుంది. శోభన్బాబుగారు డ్యాన్స్ చేసిన షూని నేను వేసుకోవడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. శ్రీదేవి, శోభన్బాబు అంత మాదిరిగా కాకపోయినా మా పరిధిలో బాగా చేసేందుకు ప్రయత్నించాం' అని చెప్పారు.
'ఈ సాంగ్ రీమిక్స్ చేయాలనేది ఎనిమిదేండ్ల కల. సలీమ్ మాస్టర్ ఎలాంటి స్టయిల్ ఫాలో అయ్యారో అలాంటి స్టయిల్నే శేఖర్ మాస్టర్ ఫాలో అయి సూపర్గా చేశారు. ఈ పాటలో వరుణ్ అదరగొట్టాడు. ఈ పాటలో పూజాని తప్ప ఎవ్వరినీ ఊహించుకోలేం. ఈ పాట థియేటర్లో ప్రేక్షకులకు కన్నుల పండగగా ఉంటుంది. ఈ పాటని చూసి 'కంగ్రాట్స్.. ఐ యామ్ హ్యాపీ' అని రాఘవేంద్రరావు సర్టిఫికెట్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది' అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. 'ఈ పాట కోసం దాదాపు 1500 బిందెలను ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్. ఈ పాటలో వరుణ్ ఇచ్చిన కొన్ని రెట్రో ఎక్స్ప్రెషన్స్ ఆడియెన్స్ని సర్ప్రైజ్ చేస్తాయి. శ్రీదేవిగారు నాకు ఇన్స్పిరేషన్. లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్రరావుగారు ఈ పాటతో ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఈ పాటకి మా పరిధిలో జస్టిఫై చేశామని భావిస్తున్నాం' అని కథానాయిక పూజా హెగ్డే చెప్పారు.