Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినయ మయూరి బిరుదు అందుకున్న సందర్భంగా జయసుధ
'సినిమాల్లో గుర్తింపు వచ్చాక నాకు మొదటి అభిమాన సంఘం వైజాగ్లోనే ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న అభిమానుల్లో ఎక్కువ మంది విశాఖలోనే ఉన్నారు. అలాంటి విశాఖలో ఇంత మంది ప్రముఖుల మధ్య 'అభినయ మయూరి' బిరుదు అందుకోవడం మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉంది' అని అన్నారు జయసుధ.
కళాబంధు, డా.టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు (సెప్టెంబర్ 17)ను పురస్కరించుకొని ప్రతి యేటా ప్రముఖ నటీనటులకు బిరుదు ప్రదానం చేసి సత్కరిస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది జయసుధని 'అభినయ మయూరి' బిరుదుతో గౌరవించారు. మంగళవారం వైజాగ్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, 'ప్రేక్షకుల ఆనందం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. ప్రతీ సంవత్సరం పుట్టిన రోజు నాడు ఇటువంటి కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. పుట్టినరోజు ఓ పవిత్రమైన రోజు. ఆ రోజు మనం మన జీవితంలో ఏం సాధించాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనే విషయాలను గుర్తు చేసుకోవాలి. నేను కళను అభినందిస్తాను, ప్రేమిస్తాను, ఆరాధిస్తాను, గౌరవిస్తాను. అందుకే కళాకారులకు సత్కారం చేస్తున్నా. శివాజీ గణేషన్, అక్కినేని నాగేశ్వరారావు వంటి ఎందరో నటీనటులను సత్కరించినట్లుగా దాదాపు 46ఏళ్ల పాటు వివిధ పాత్రల్లో జీవించి, పాత్రల్లో లీనమైపోయిన జయసుధకు 'అభినయ మయూరి' అవార్డును ఇస్తూ సత్కరించడం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.
జయసుధ మాట్లాడుతూ, 'ప్రతీ సంవత్సరం సుబ్బిరామిరెడ్డిగారి పుట్టినరోజుకి వస్తుంటాం. కానీ, ఈ సంవత్సరం నన్ను ఇలా సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. నన్ను సినీ పరిశ్రమలోకి తీసుకు వచ్చిన విజయనిర్మల ఈ వేడుకలో లేకపోవటం నాకు చాలా వెలితిగా ఉంది. నా తొలి సినిమా 'పండంటి కాపురం'లో జమున నా తల్లి పాత్ర పోషించారు. అప్పుడు నా వయసు 12 ఏళ్లు. ఇన్నేళ్ల తరువాత నా బిరుదు ప్రదానోత్సవంలో ఆమె పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నా. సినీ జీవితంలో చాలా మంది స్నేహితులు ఉంటారు. కానీ అందులో కొంత మంది మాత్రమే మన నిజ జీవితంలో కూడా ఉంటారు. నాకు జయప్రద, రాధిక, మురళీమోహన్ అలాంటివారే. టీఎస్సార్ నిరంతరం కళాకారులను ప్రోత్సహించడమే అలవాటుగా మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని తెలిపారు.