Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సైరా నరసింహారెడ్డి'ది విషాద ముగింపు కాదు. ఆయన జీవితం ఒక విక్టరీ. మరణమూ ఒక విక్టరీ. ఇది సినిమాకి ప్లస్ అవ్వడమే కాకుండా ప్రతి ఆడియెన్కి కనెక్ట్ అవుతుంది' అని అన్నారు దర్శక, నిర్మాతలు సురేందర్రెడ్డి, రామ్చరణ్.
మొదటి తరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. టైటిల్ పాత్రలో చిరంజీవి నటించగా, ఆయన సరసన నయనతార నటించారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. సురేందర్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. బుధవారం ట్రైలర్ని రిలీజ్ చేసిన సందర్భంగా రామ్చరణ్, సురేందర్రెడ్డిలతో మీడియా జరిపిన ఇంటరాక్షన్ విశేషాలు..
రికార్డుల గురించి ఆలోచించను : రామ్చరణ్
ఈ సినిమాని ఎందుకు నిర్మించారు?
- ఇది పదేండ్ల క్రితమే నాన్నగారు, పరుచూరి బ్రదర్స్ చేయాలనుకున్నా ప్రాజెక్ట్. నాన్న డ్రీమ్ ప్రాజెక్ట్ని నేను తీశా. ఇందులో నా గొప్పతనమేమీ లేదు. ఈ సినిమాని నిర్మించే అవకాశం రావడమే ఎక్కువ. అంతేకాని నటించాలనుకోలేదు. అక్టోబర్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా.
సురేందర్రెడ్డిని ఎంపిక చేయటానికి రీజన్?
- ఆయన సినిమాల్లో వినోదం బాగా ఉంటుందని మనకి తెలుసు. కానీ 'ధృవ' చేసిన తర్వాత ఆయనలో వినోదంతోపాటు ఇంటెన్స్ కూడా ఉందని, దాన్ని బాగా డీల్ చేయగలడనే నమ్మకంతో ఈ సినిమా చేశాం.
చిరంజీవి లుక్స్, గెటప్ పరంగా ఎలాంటి హోం వర్క్ చేశారు?
- డాడీ లుక్కి సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్, ఆయన టీమ్ చాలా కేర్ తీసుకుని అద్భుతంగా చేశారు. అవి బాగా కుదిరాయి. పవన్ కళ్యాణ్ వాయిస్ ట్రైలర్కే పరిమితం కాదు, సినిమాలోనూ ఉంటుంది.
ఇంత పెద్ద భారీ తారాగణాన్ని సెట్ చేయటం ఎలా సాధ్యమైంది?
- ఏదైనా ప్రారంభించాలంటే మన ఆలోచన స్వచ్ఛంగా ఉండాలి. ఆ స్వచ్ఛమైన ఆలోచనతో తీసిన చిత్రమే ఇది. ఓ రకంగా ఇంత పెద్ద స్టార్ కాస్ట్ కుదరడానికి డాడీ కూడా ఓ కారణం. దీనికితోడు నరసింహారెెడ్డి బలమే అందరిని కలిపింది.
ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారా?
- కలెక్షన్లు, రికార్డుల గురించి ఆలోచించి సినిమా చేయలేదు. చిరంజీవిగారు, సురేందర్రెడ్డి ఏది అడిగితే అది ఇచ్చాం. అనుకున్నది తెరపై కనిపించాలని, నాన్నకి ఓ మంచి సినిమా ఇవ్వాలని మాత్రమే చేశా. అసలు డబ్బులు వస్తాయా? రావా అనేది కూడా ఆలోచించలేదు. ఓ ప్యాషన్తో చేశాం.
ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ఎందుకు ఆందోళన చేశారు?
- సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వందేండ్ల తర్వాత ఓ వ్యక్తి జీవితం చరిత్రగా మారుతుంది. దాన్ని సినిమాగా తీయాలంటే ఎంతో గౌరవంగా తెరకెక్కించాలి. మంగల్ పాండే జీవిత చరిత్రని తెరకెక్కించేటప్పుడు 65 ఏండ్లు ఉంటే సరిపోతుందన్నారు. అలానే నరసింహారెడ్డి ఇప్పుడు ఒక కుటుంబానికి పరిమితమయ్యే వ్యక్తికాదు. ఆయన దేశానికి చెందిన వ్యక్తి. ఆయన దేశం కోసం పోరాడారు. ఆయనపై ఎవరైనా సినిమా తీయోచ్చు. అంతేకాదు ఆయన ఒక కుటుంబానికి, కొంత మందికి మాత్రమే పరిమితం కాదు. అలా పరిమితం చేస్తే ఆయన స్థాయిని దిగజార్చడమే అవుతుంది.
మెగాస్టార్ స్ఫూర్తి, చరణ్ ధైర్యం : సురేందర్రెడ్డి
ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు రియాక్షన్ ఏంటి?
- చరణ్, చిరంజీవిగారు పిలిచి ఈ సినిమా డైరెక్ట్ చేయాలని చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అసలు ఇలాంటి ప్రాజెక్ట్ నా దగ్గరికి వస్తుందని ఊహించలేదు. నిర్ణయం తీసుకోవడానికి 15 రోజులు టైమ్ అడిగాను. ఆ టైమ్లో 'సైరా' పాత్రలో చిరంజీవి కనిపించారు. ఆయన ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో అర్థమైంది. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని, చరణ్ ఉన్నారన్న ధైర్యంతో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా.
ఎలాంటి రీసెర్చ్ చేశారు?
- సాధ్యమైనంత వరకు మాకు దొరికిన ఆధారాల ప్రకారం తెరకెక్కించాం. దీని కోసం ఆరు నెలలు రీసెర్చ్ చేశాను. చాలా పుస్తకాలు చదివాను. నంద్యాల ఎంపీ పోచారం బ్రహ్మానందరెడ్డి 'రేనాటి సూర్యచంద్రులు' అనే ట్రస్ట్ని నడిపిస్తున్నారు. ఆయన్నుంచి చాలా విషయాలు తెలుసుకున్నా. ప్రభుత్వం విడుదల చేసిన స్టాంప్ని కూడా ఆయన ఇచ్చారు. మద్రాస్ గెజిట్ని తీసుకొచ్చి రీసెర్చ్ చేశాం. వీటన్నింటి ఆధారంగా ఫైనల్గా ఓ కథ అనుకుని ఫిక్షన్ కంటే రియాలిటీనే ఎక్కువగా ఉండేలా రూపొందించాం.
మార్కెట్ కోసమే పరభాషా నటీనటుల్ని తీసుకున్నారా?
- అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా ఇలా అందరి పాత్రలు కథలో భాగంగానే ఉంటాయి. క్యారెక్టర్స్ డిమాండ్ మేరకే వారిని తీసుకున్నాం. ఆయా పాత్రలకు వాళ్ళంతా అంగీకరించడానికి కారణం చిరంజీవే. అంతేకాని మార్కెట్ కోసం తీసుకోలేదు. ఆయా పాత్రల్లో వాళ్ళని తప్ప మరెవ్వరీ ఊహించుకోలేం. అంత బాగా కుదిరారు.
సంచలనం కోసమే ఈ సినిమా చేశారా?
- ఈ సినిమాని రికార్డుల కోసమో, ఏదో సంచలనాలు సృష్టిస్తుందనో చేయలేదు. చిరంజీవిగారి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాని తన తండ్రికి గిఫ్ట్గా ఇవ్వాలని, ఇలాంటి ఓ మంచి సినిమా చేయాలనే డాడి సంకల్పాన్ని నిజం చేయాలని చరణ్ ఈ ప్రాజెక్ట్ని చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం, ఆయన పోరాటం, త్యాగం చాలా గొప్పది. చివర్లో ఆయన తల నరికి కోట గుమ్మానికి 30 ఏండ్లపాటు వేలాడదీశారంటే బ్రిటీష్ వారిని ఆయన ఎంతగా భయపెట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అదే ఈ సినిమాకి పెద్ద కమర్షియాలిటీ. ఈ సినిమాకి టెక్నాలజీ ఎంతో ఉపయోగపడింది. అదే పదేండ్ల క్రితం తీయాల్సి వస్తే దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ అయ్యేది. పైగా ఇంత మంచి అవుట్పుట్ కూడా వచ్చేది కాదు. పెరిగిన టెక్నాలజీతో అనుకున్న దానికంటే బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. విషాదభరిత ముగింపు ఉన్న సినిమాలు నిరాశపరుస్తాయనే కామెంట్ ఉంది. అయితే ఇదొక చరిత్ర. నరసింహారెడ్డి తన జీవితాన్ని త్యాగం చేసి విజయం సాధించారు. ఈ సినిమాకి అదే విక్టరీ. సినిమాకున్న ప్లస్ పాయింట్ కూడా అదే. ఆయన తన ప్రాణ త్యాగంతో స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ అంశాలు ఆడియెన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి.