Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వారసత్వం మనం ఇండిస్టీలో అడుగుపెట్టేందుకే పనిచేస్తుంది. చిత్ర పరిశ్రమలో నిలబడాలంటే మనమేంటో నిరూపించుకోవాలి. అది మన ప్రతిభపై ఆధారపడి ఉంటుంది' అని అంటోంది సోనాక్షి సిన్హా. బంధుప్రీతి, వారసత్వం గురించి ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి మాట్లాడుతూ, 'వారసత్వం అనేది మొదటి సినిమాకే పరిమితం. ఆ తర్వాత మన ప్రతిభ, హార్డ్ వర్క్ మాట్లాడతాయి. కేవలం వారసత్వంతో ఇండిస్టీలో మనుగడ సాధించడం కష్టం. అదే సమయంలో చాలా స్ట్రగుల్ కూడా ఉంటుంది. స్టార్ కిడ్స్ అవ్వడం వల్ల తల్లిదండ్రులకు సంబంధించిన ఇమేజ్ని మోయాల్సి ఉంటుంది. దీంతో మనపై ఆడియెన్స్లో అంచనాలుంటాయి. వాటిని మనం అందుకోవాలి. వాటిని అందుకునే క్రమంలో ఎంతో ఒత్తిడి ఫీలవ్వాల్సి వస్తుంది. దీంతోపాటు అనేక ఇతర స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడొస్తున్న వారిలో చాలా మంది బయటివారే ఉన్నారు. వారు తమ ప్రతిభతో రాణిస్తూ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారితో మన పోటీ పడాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇండిస్టీకి సంబంధం లేని చాలా మంది ఇప్పుడు పరిశ్రమని రూల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క రంగంలో జయాపజయాలు కామన్. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు వరకు మా తల్లిదండ్రులు జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్ని ఒకేలా చూడమని చెప్పారు. నేను దాన్నే ఫాలో అవుతున్నా. ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటున్నా. ఒకే జోనర్కి ఫిక్స్ కావడం లేదు. సాధ్యమైనంత వరకు భిన్నమైన సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా. అందులో భాగంగానే ప్రస్తుతం 'దబాంగ్ 3', 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రాల్లో నటిస్తున్నా' అని చెప్పింది.