Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల్ని మెప్పించడంలో డా|| శివప్రసాద్ దిట్ట. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా, హాస్యనటుడిగా, కామెడీ విలన్గా.. ఇలా భిన్న పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాటక రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ఆయన నటుడిగానే కాదు, దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. విభిన్న పాత్రలతో మెప్పించిన ఆయన హఠాన్మరణం తెలుగు చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడవటం బాధాకరం.
1951 జులై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించిన నారమల్లి శివప్రసాద్ తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశారు. చాలా రోజులు వైద్యుడిగా సేవలందించారు.
నటనపై అమితాసక్తి ఉండటంతో స్కూల్, కాలేజీ రోజుల్లోనే నాటకాల్లో నటించారు. రంగస్థల నటుడిగా ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. శివప్రసాద్ ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఆయన పెద్దక్క ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు కలిసి ఓ డ్రామా వేశారు. అందులో అక్కతో మగ వేషం వేయించారు. ఆ నాటకంతో ఆమెకి మంచి పేరొచ్చింది. ఆమె చెప్పడంతో 'ముందంజ' అనే నాటకంలో కామెడీ విలన్ పాత్ర పోషించి మొదటి బహుమతిని అందుకున్నారు. పదో తరగతి చదువుకునే టైమ్లో 'పరువు కోసం' నాటకంలో మరోసారి కామెడీ విలన్గా నటించారు. ఎంబీబీఎస్ చేస్తున్న టైమ్లో కూడా డ్రామాలు వేశారు. అంతేకాదు పలు నాటకాలకు తనే దర్శకత్వం వహించారు. ఉద్యోగం వచ్చాక తన స్టూడెంట్స్కి డ్రామాలు నేర్పించేవారు. ఆ టైమ్లో దర్శకుడు భారతీరాజాతో ఏర్పడిన పరిచయం 'కొత్త జీవితాలు' అనే చిత్రంలో నటించే అవకాశం తెచ్చిపెట్టింది. మొదటి సినిమా అవకాశం కావడంతో ఆయన ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే నటించారు. ఆ తర్వాత వరుసగా 'ఖైదీ', 'పోరాటం', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'రారాజు', 'ఈ దేశంలో ఒక రోజు', 'ఇది కాదు ముగింపు', 'తులసి', 'దూసుకెళ్తా', 'ఆటాడిస్తా', 'మస్కా', 'కుబేరులు', 'ఒక్కమగాడు', 'కితకితలు', 'డేంజర్' వంటి తదితర చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా నటించి ఆకట్టుకున్నారు. నటనపై ఉన్న ప్యాషన్తో చాలా సినిమాలకు ఆయన పారితోషికం తీసుకోకుండానే నటించడం విశేషం. ఆయన నటించిన చివరి చిత్రం 'సాఫ్ట్వేర్ సుధీర్'. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.నటుడిగానే కాదు, దర్శకుడిగానూ తానేంటో నిరూపించుకున్నారు. 'ప్రేమ తపస్సు', 'టోపీ రాజా స్వీటీ రోజా', 'ఇల్లాలు', 'కొక్కొరొకో' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటిగా రాణించిన రోజాని వెండితెరకు పరిచయం చేసింది శివప్రసాదే కావడం విశేషం. భారతీరాజాని ఆదర్శంగా తీసుకుని నూతన నటీనటులను పరిచయం చేయాలనుకున్నారు. అందులో భాగంగా తాను దర్శకత్వం వహించిన 'ప్రేమ తపస్సు' చిత్రంలో హీరోయిన్గా కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడు శ్రీలత పేరుతో ఉన్న అమ్మాయిని రోజాగా మార్చి ఆ చిత్రానికి ఎంపిక చేశారు. మెడిసిన్ చదివే టైమ్లో క్లాస్మేట్ విజయలక్ష్మిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. శివప్రసాద్ మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
డా||శివప్రసాద్ మా 'సాఫ్ట్వేర్ సుధీర్' సినిమాలో మంత్రి పాత్రలో నటించారు. ఆయన నటించిన ఈ ప్రత్యేక పాత్ర సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంతలోనే ఆయన కన్నుమూయడం బాధాకరం.
ఆయన మరణం చిత్ర పరిశ్రమకి
తీరని లోటు. వారి కుటుంబానికి
నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
- కె.శేఖర్ రాజు, నిర్మాత