Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హీరోగా నటించిన 'ఎవ్వరికీ చెప్పొద్దు' చిత్రానికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. విడుదలకు ముందే కొరటాల శివ, సుకుమార్ సినిమా చూసి హిట్ గ్యారంటీ అన్నారు. ఇప్పుడదే నిజమైంది' అని హీరో రాకేష్ వర్రే అన్నారు.
'బద్రినాథ్', 'బాహుబలి' వంటి చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించిన రాకేష్ హీరోగా మారి 'ఎవ్వరికీ చెప్పొద్దు' చిత్రంలో నటించారు. బసవ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయదశమి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హీరో రాకేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
అందులో సంతృప్తి దొరకలేదు
చిన్నప్పట్నుంచి నాకు చిరంజీవిగారంటే ఇష్టం. ఆయన నటించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాని ఓ 50, 60 సార్లు చూసి ఉంటా. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం. అయితే సినిమా మనకు తెలియని ఫీల్డ్ కాబట్టి స్టడీస్పై ఫోకస్ చేసినప్పటికీ అసంతృప్తి ఉండేది. దీంతో నటుడిగా రాణించాలని చిత్ర పరిశ్రమలోకి వచ్చా. ప్రారంభంలోనే హీరోగా ఏడాదిన్నరపాటు ప్రయత్నించా. ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో విలన్గా ప్రయత్నాలు చేశా. 'జోష్' సినిమాతో దిల్రాజు నన్ను తెరకి పరిచయం చేశారు. ఆ తర్వాత 'వేదం', 'బద్రీనాథ్', 'మిర్చి' వంటి చిత్రాలు చేశా. ఎప్పట్నుంచో రాజమౌళితో పనిచేయాలని ఉండేది. 'బాహుబలి' టైమ్లో అనేక ప్రయత్నాల ఫలితంగా అందులో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా నాకు ఎంతో గుర్తింపు తెచ్చింది. తర్వాత వరుసగా 'జై లవకుశ', 'గూఢచారి' వంటి చిత్రాల్లో నటించా.
అందరూ నో చెప్పారు
'బాహుబలి' టైమ్లో వచ్చిన గ్యాప్లో న్యూయార్క్లో ఫిల్మ్ కోర్స్ చేశాను. హీరోగా చేయాలని అనేక మంది దర్శకులను కలిశాను. మంచి స్క్రిప్ట్ ఏదైన ఉంటే చెప్పండి అనే అందరి వెనకాల పడేవాడిని. అలా 47 కథలు విన్నాను. ఈ క్రమంలోనే ఈ చిత్ర దర్శకుడు శంకర్ పరిచయం అయ్యాడు. అప్పటికే తను ఓ సంస్థలో ఈ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. హీరో కూడా ఫైనల్ అయ్యాడు. అయితే నన్ను ఓ అప్షన్గా పెట్టుకోమన్నాను. కానీ చివరికి అది నా దగ్గరికే రావడం, నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో నేనే నిర్మాతగా మారి ఈ సినిమా తీశా. బడ్జెట్ పరిమితులుండటంతో అందరి సహకారంతో పూర్తి చేశాను. మా ఇంట్లోనే కాదు కాలేజ్లో కూడా క్యాస్ట్ గురించి ఎక్కువగా విన్నా. మన క్యాస్ట్ వాళ్ళతో స్నేహం పెంచుకో అని మా అమ్మ చెప్పేది. అది నాకు ఆసక్తికరంగా అనిపించింది. ఈ కథ కూడా అదే కావడంతో బాగుంటుందనిపించింది. నాకు మాత్రం క్యాస్ట్ ఫీలింగ్ లేదు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ని టార్గెట్ చేసి రూపొందించాం. అయితే ఏ క్యాస్ట్ని కించపరచకుండా బ్యాలెన్డ్స్గా తీశాం.
కలిసొచ్చిన సెలవులు
దసరా సందర్భంగా విడుదలైన సినిమాకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. మేం ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన లభిస్తుంది. యూత్ ఎక్కువగా వస్తారనుకున్నాం. కానీ ఫస్ట్ డే నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తున్నారు. క్రమంగా యూత్, కాలేజ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు. శివపార్వతి థియేటర్కి వెళితే దాదాపు 800 మంది వరకు వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చాలా చోట్ల దాదాపు 70 శాతం ఫుల్ అయ్యాయి. తాజాగా సెలవులు పెరగడం మా సినిమాకి బాగా కలిసొచ్చింది. నెక్ట్స్ ఇంకా ఏ సినిమాకి కమిట్ కాలేదు. మంచి కథల కోసం చూస్తున్నా. బలమైన పాత్రలు వస్తే విలన్ రోల్స్ చేయడానికీ సిద్ధమే.