Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో దర్శక, నిర్మాత ఆనంద్.ఎల్.రారుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సినిమాలకు ప్రత్యేక అభిమాన గణమూ ఉంది. ఆయన సినిమాలన్ని చాలా వైవిధ్యంగా, వాస్తవికతకు అద్దం పడతాయి. ఈయన చిత్రాల్లో నటించేందుకు బాలీవుడ్ కథానాయికలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల ఆయన రూపొందించిన 'జీరో' చిత్రంలో కత్రినాకైఫ్ నటించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. పైగా కత్రినా పోషించిన పాత్రకు మంచి గుర్తింపూ లభించింది. మరోమారు ఆనంద్.ఎల్.రారుతో కలిసి పని చేసే అరుదైన అవకాశం కత్రినాకి లభించిందని సమాచారం. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కత్రినా ఇందులో కనిపించడం ఓ విశేషమైతే, బహుముఖ ప్రజ్ఞాశాలి విద్యాబాలన్తో కలిసి స్క్రీన్ని షేర్ చేసుకోవడం మరో విశేషం. ఇదిలా ఉంటే, అనిరుథ్ గణపతిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రారు ఈ చిత్రాన్ని నిర్మించడం ఇంకొక విశేషం. యాక్షన్, కామెడీ నేపథ్యంలో సాగే మహిళా ప్రధాన చిత్రంగా దీన్ని రారు నిర్మించబోతున్నారు. ''ఇదొక యాక్షన్, కామెడీ నేపథ్యంలో ఉండే సినిమా. కత్రినా ఇప్పటివరకు యాక్షన్ సినిమాలు చేశారు. అలాగే కామెడీ సినిమాలూ చేశారు. అయితే తొలిసారి యాక్షన్, కామెడీ రెండూ ఉన్న సినిమాలో నటిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ కత్రినాని బాగా ఎగ్జైట్ చేసింది' అని చిత్ర బృందం తెలిపింది. 'సూర్యవంశీ'లో కత్రినా, 'శకుంతల దేవి' చిత్రంలో విద్యాబాలన్ ప్రస్తుతం నటిస్తూ బిజీగా ఉన్నారు.