Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రచయితలు సరస్వతీ పుత్రులు, మహానుభావులు. వారు ఎక్కడున్న వెతికి మరీ నమస్కరించమని మా నాన్నగారు చెప్పేవారు. నేను ఎంతో మంది మహానుభావులతో కలిసి పనిచేశాను. అలాంటి తెలుగు రచయితల సంఘం త్వరలో రజతోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. వారికి నా సహకారం అందిస్తాను' అని నటులు కృష్ణంరాజు అన్నారు. తెలుగు సినీ రచయితల సంఘం ఏర్పడి 25ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 3న రజతోత్సవ వేడుకలను నిర్వహించబోతున్నారు.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఈ వేడుకకి సంబంధించిన టీజర్ని విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన కృష్ణంరాజు టీజర్ని ఆవిష్కరించారు. 'ఈ వేడుకలో నిన్నటి తరం వారికి జీవన సాఫల్య పురస్కారాలు, నవతరానికి విశిష్ట పురస్కారాలు, ప్రతిభావంతులకు ప్రతిభా పురస్కారాలు, ప్రముఖులకు గౌరవ పురస్కారాలు అందిస్తాం' అని అధ్యక్షులు పరుచూరిగోపాలకృష్ణ, కార్యదర్శి ఆకెళ్ళ తెలిపారు. ''సినిమా అనేది 'కినిమా' అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. నిజానికి భారతీయ సినిమా 1890లో ప్రారంభమైనందని చరిత్ర చెబుతుంది. 1896లో 'లివింగ్ ది ట్రైన్' అనే లఘు చిత్రాన్ని లండన్లో తీసినట్టు ఉంది. 1932లో ఫిబ్రవరి 6న వచ్చిన 'భక్త ప్రహ్లాద'తో తెలుగు సినిమా ప్రారంభమైనదిగా చెప్పుకుంటున్నాం. ఆ దశకంలోనే వరకట్నంపై 'గృహలక్ష్మి', కులంపై 'మాలపిల్ల' వంటి చిత్రాలొచ్చాయి' అని పరుచూరి బ్రదర్స్ చెప్పారు.
1941-50 దశకం గురించి ఎస్వీరామారావు చెబుతూ, 'ఈ దశకంలో సముద్రాల వంటి రచయితలు పరిచయమై ఏకంగా 220 పాటలు రాశారు' అని అన్నారు. 1951-60 గురించి నాగబాల సురేష్ కుమార్ చెబుతూ, 'తెలుగు సినిమా ఈ దశకంలోనే ఉజ్వలంగా రాణించింది. 'పాతాళభైరవి', 'దేవదాస్', 'మల్లీశ్వరి', 'మాయా బజార్' లాంటి సినిమాలొచ్చాయి. రాజశ్రీ, పాలగుమ్మి, ఆరుద్ర, వాసిరెడ్డి, కొసరాజు, గురజాడ వంటి వారు పరిచయం అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకి అవార్డులొచ్చాయి' అని తెలిపారు.
1961-70 దశకం గురించి వడ్డెపల్లి కృష్ణ చెబుతూ, 'ఇదొక స్వర్ణయుగమని చెప్పొచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్ర హీరోలు బాగా రాణించడం, 'గుండమ్మకథ' వంటి అత్యుత్తమ, ఆణిముత్యం లాంటి సినిమాలొచ్చాయి. సినారే లాంటి వారు పరిచయమయ్యార'ని తెలిపారు. 1971-80 దశకం గురించి చిలుకుమర్తి నటరాజు చెబుతూ, 'తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కిన దశకం ఇది. స్క్రీన్ప్లేలో కొత్త ఒరవడి ప్రారంభమైంద'న్నారు. 1981-90 దశకం గురించి ఉమర్జీ అనురాధ చెబుతూ, 'ఇది సాహసోపేతమైన దశకం. పెత్తందారులు భూస్వాములు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కమ్యూనిస్టు నేపథ్యంలో సినిమాలొచ్చాయి. ఆ ఘనత పరుచూరి బ్రదర్స్, టి.కృష్ణ వంటి వారికి దక్కుతుంది. వేటూరి విశ్వరూపం, ఆర్.నారాయణమూర్తి పరిచయం జరిగింద'ని చెప్పారు.
1991-20 గురించి బలభద్రపాత్రుని రమణి చెబుతూ, 'కె.విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావు, వంశీల ట్రెండ్ సాగింది. పవన్ కళ్యాణ్, మహేష్బాబు వంటి స్టార్స్ పరిచయమయ్యార'అని తెలిపారు. 2001-2010 గురించి వెనిగళ్ల రాంబాబు చెబుతూ, 'సంస్కారవంతమైన టైటిల్స్తో కూడిన ఫ్యామిలీ కథలకు పెద్ద పీఠవేసిన చిత్రాలు, వైవిధ్యమైన సినిమాలు, 'మగధీర' లాంటి చిత్రరాజ్యం వచ్చింద'ని చెప్పారు. 2011-20 వరకు డైమండ్ రత్నబాబు వివరిస్తూ తెలుగు సినిమా సరికొత్త పుంతలు తొక్కిందన్నారు.