Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఈ రోజు నాకు ఎంతో ముఖ్యమైనది. మా నాన్న (శ్రీనివాసన్) వర్థంతి కూడా. ఆయన నాకు గురువు. చనిపోయేంత వరకు జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు నేర్చించారు. అందుకే ఆయన పేరుతో టాలెంట్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభిస్తున్నాం' అని కమల్ హాసన్ అన్నారు. విలక్షణ నటనతో, విభిన్న పాత్రలతో, అద్భుతమైన చిత్రాలతో లోకనాయకుడిగా పాపులర్ అయిన కమల్ హాసన్ 65వ పుట్టిన రోజు వేడుక గురువారం చెన్నైలో కుటుంబ సభ్యులతో ఘనంగా జరిగింది. తన పుట్టిన రోజే తండ్రి శ్రీనివాసన్ వర్థంతి కావడంతో పరమకుడిలోని తమ నివాసంలో తండ్రి విగ్రహాన్ని కమల్ సోదరుడు చారుహాసన్ ఆవిష్కరించారు. అలాగే తెలిచతనల్లుర్లో ఎంఎన్ఎం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని శృతిహాసన్, అక్షర హాసన్, నలిని, సుహాసినీ తదితరులు కలిసి ప్రారంభించారు. దీంతోపాటు శుక్రవారం సినీ గురువు కె.బాలచందర్ విగ్రహాన్ని సొంత సినీ నిర్మాణ సంస్థలో కమల్ ఆవిష్కరించబోతున్నారు. ఈ వేడుకకి రజనీకాంత్ ముఖ్యఅతిథిగా వస్తున్నారు. మూడు రోజులపాటు కమల్ పుట్టిన రోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. అలాగే ఈ నెల 17న మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఆధ్వర్యంలో సంగీత విభావరి జరుగనుంది. రజనీకాంత్, మహేష్బాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కమల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భారతీయుడు 2'లో నటిస్తున్నారు. కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కమల్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రంలోని కొత్త లుక్ని గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. అఖండ విజయం సాధించిన 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్గా దీన్ని నిర్మిస్తున్నారు.