Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ షెహన్షాగా, బిగ్బిగా ప్రేక్షకులు, అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన అమితాబ్ బచ్చన్ నటుడిగా యాభై ఏండ్లు పూర్తి చేసుకోవడం విశేషం. హీరోగా పనికిరావనే పరిస్థితి నుంచి బాలీవుడ్ని శాసించే స్థాయికి ఎదిగిన అమితాబ్ ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. తొలి సినిమా 'సాత్ హిందుస్థాని'తో (1969 నవంబర్ 7న విడుదలైంది) నటుడిగా భారతీయ వెండితెరకు అమితాబ్ బచ్చన్ పరిచయం అయ్యారు. గురువారంతో నటుడిగా యాభై వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఓ నటుడు ఇన్నేండ్లు సక్సెస్ఫుల్గా రన్ అవడం మామూలు విషయం కాదు. ఎంతో హార్డ్వర్క్, డెడికేషన్, ప్యాషన్ ఉండాలి. అవన్నీ ఉన్నాయి కాబట్టే బిగ్బి ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడయ్యారు. బిగ్బి గోల్డెన్ జూబ్లీ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా బిగ్బి తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్ భావోద్వేగంతో నిండిన ఓ పోస్ట్ పెట్టారు. 'గొప్పతనానికి సాక్ష్యం మీరు. మేమంతా మీ ఆశీర్వాదంతో వచ్చాం. మెచ్చుకోవడానికి, నేర్చుకోవడానికి అభినందించడానికి, అభిమానించడానికి మీలో ఇంకా చాలా ఉంది. బచ్చన్ ఉన్న కాలంలో మేమున్నామని కొన్ని తరాలు గర్వంగా చెప్పుకుంటున్నాయి. ఈ విషయాన్ని మీ తనయుడిగా కాదు, ఓ నటుడిగా, ఓ అభిమానిగా చెబుతున్నా. ఇండిస్టీలో యాభై ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు అభినందనలు. మీ మరో యాభై ఏండ్ల జర్నీ కోసం వెయిట్ చేస్తున్నాం' అని అభిషేక్ పేర్కొన్నారు. అమితాబ్ ప్రస్తుతం 'ఝుండ్', 'ఏబి ఆని సీడీ', 'బ్రహ్మాస్త్ర', 'చెహర్', 'గులాబో సితాబో', 'బట్టర్ఫ్లై', 'ఉయర్థా మనిథన్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.